ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుల జాబితాలో గాంధీజీ పేరే అందరికీ గుర్తొస్తుంది. గాంధీజీ ఏర్పాటు చేసిన ఆశ్రమం అనగానే చాలామంది సబర్మతి ఆశ్రమం పేరు చెబుతారు. ఈ ఆశ్రమం ఉత్తరాదిలో స్థాపించినది. కానీ, దక్షిణాదిలో కూడా ఆయన స్థాపించిన ఆశ్రమం ఒకటి ఉందని ఎవరికైనా తెలుసా..? అదేంటని అనుకుంటున్నారా? రండి నేడు ఆ ఆశ్రమం గురించి విషయాలను తెలుసుకుందాం...
ఫొటో గ్యాలరీ..
గాంధీజీ దక్షిణ భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం" పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని "దక్షిణ సబర్మతి" అని కూడా అంటారు. పినాకిన ఆశ్రమం 1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీ స్వయంగా తన స్వహస్తాలతో ప్రారంభించారు. ఈ ప్రదేశాన్ని మహాత్ముడు తిరగాడిన నేలగా చెబుతుంటారు. ఈ ఆశ్రమం మరెక్కడో లేదండి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పల్లిపాడు సమీపంలో ఈ ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ప్రధాన స్థావరంగా ఉండేది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో కూడా ఈ ఆశ్రమం కీలకపాత్ర పోషించదనే చెప్పుకోవాలి. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఒక ఫొటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో స్వాతంత్య్రోద్యమ సమయంలోని చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ ఆశ్రమానికి సందర్శించడానికి వచ్చిన వారు వీటిని చూసి మంత్ర ముగ్ధులవ్వాల్సిందే. ఇప్పటికి ఈ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయంటే ఈ ఆశ్రమానికి ఎంతటి చరిత్ర ఉందో అర్థమవుతుంది.

గాంధీజీ కాంస్య విగ్రహం..
పినాకిని ఆశ్రమం సుమారు 18ఎకరాల స్థలంలో ఉంటుంది. ఈ ఆశ్రమం పక్కనే పెన్నానది ఉంటుంది. ఈ ఆ్రశమం చుట్టూ పచ్చటి పైర్లు, చెట్లతో గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టేలా ఉంటుంది. ఇక ఇక్కడి వాతవరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పినాకిని ఆశ్రమంలో డీ అడిక్షన్ కేంద్రం కూడా ఉంది. వీటితోపాటు ఆశ్రమంలో విశాలమైన రోడ్లు, సందర్శకులు సేదతీరేందుకు విశ్రాంతి భవనం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, గాంధీజీ డిజిటల్ మ్యూజియం, ఫుడ్ కోర్టు, గ్రంథాలయం వంటి వాటిని కూడా నిర్మించారు. ఆశ్రమం ప్రవేశంలో మహాత్ముడు గాంధీజీ కాంస్య విగ్రహం ఒకటి ఉంటుంది. ఈ విగ్రహం పర్యాటకులకు సాదరర ఆహ్మానం పలుకుతున్నట్లు ఉంటుంది. ప్రస్తుతం పినాకిని ఆశ్రమ బాధ్యతలను రెడ్క్రాస్ సొసైటీ తీసుకుంది. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్కు కాస్త మరమ్మత్తులు చేయించారు. పినాకినీ గాంధీ ఆశ్రమం కాలక్రమేణా ఓ పర్యాటక ప్రాంతంగా మార్పు చెందింది.
పల్లెపాడు గాంధీ దేవాలయం...
ఇక ఇక్కడి బడి పిల్లలు పినాకిని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించేందుకు నిత్యం వస్తుంటారు. అందుకే ఈ ఆశ్రమాన్ని పల్లెపాడు గాంధీ దేవాలయంగా అని చిన్నారులు ముద్దుగా పిలుస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారంతా రఘుపతి రాఘవ రాజారాం అని నామస్మరణ చేస్తూ వస్తుంటారు. పుస్తకాలలో ఉన్న గాంధీ చరిత్రను ఇక్కడి ఉపాధ్యాయుడు వినిపిస్తుంటే చిన్నారులు ఎంతో ఆసక్తిగా అభ్యసిస్తారు.

వెళ్లాల్సిన సమయం..
నెల్లూరులోని గాందీ పినాకిని ఆశ్రమానికి వెళ్లాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లొచ్చు.
చేరుకోవడం ఎలా?
పినాకిని ఆశ్రమానికి వెళ్లాలనుకునేవారు ఏ మార్గం నుంచైనా వెళ్లొచ్చు. రోడ్డు, ట్రైన్, విమానం అన్నీ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గంలో ప్రయాణం చేయాలనుకునేవారు నెల్లూరు స్టేషన్లో ట్రైన్ దిగాక అక్కడి నుంచి పల్లిపాడుకు ఆర్టీసీ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇక, రో్డు మార్గంలో అయితే, నెల్లురూ వరకూ ఆర్టిసి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి పల్లిపాడుకు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. మరెందుకాలస్యం ఈ పంద్రాగస్టు వేళ పినాకిని గాంధీ ఆశ్రమం చూడాల్సిందే..!



Click it and Unblock the Notifications













