శ్రీకాకుళం జిల్లాలో రాజరాజేశ్వరి(రాజమ్మ) అమ్మవారి జాతర సందడి మొదలైంది. తమ ఇంటి ఇలవేల్పుగా భావించే రాజమ్మను దర్శించుకునేందుకు సిక్కోలు వాసులు బారులుతీరుతున్నారు. ఏటా నిర్వహించే పూజలను అందుకునేందుకు రాజమ్మ తల్లి ముస్తాబయింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాజరాజేశ్వరి (రాజమ్మ తల్లి) అమ్మవారిని కొలుస్తున్న భక్తులు తమ తొలి సంతానాన్ని ఇక్కడికి తీసుకువచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరెందుకు ఆలస్యం తీరప్రాంతాన వెలసిన రాజమ్మ తల్లి జాతర విశేషాలను తెలుసుకుందాం రండి..
శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని మత్స్యకార గ్రామం వత్సవలస. ఇక్కడ వెలసిన రాజరాజేశ్వరి (రాజమ్మ) జాతరకు భక్తులు పోటెత్తున్నారు. ఈ జాతర శనివారం (ఫిబ్రవరి 24న) సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఈ జాతరలో తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర నుంచి వేలాది కుటుంబాలు తమ ఇంటి దేవతగా కొలిచే రాజమ్మతల్లిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమ ఇంటిదేవత కావడంతో మాఘమాసంలో ఆదిపీఠమైన వత్సవలస వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడికి తెలుగురాష్ట్రాలతోపాటు ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి..
శనివారం రాత్రికే వేలాదిమంది భక్తులు వత్సవలస చేరుకోవడంతో వీధులన్నీ కిటకిటలాడుతాయి. అంతేకాదు, అక్కడే వంట చేసుకొని కుటుంబసమేతంగా బస చేస్తారు. వేకువజామున సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి భూలోకమ్మను దర్శించుకునేందుకు బయలుదేరుతారు. ఈ గ్రామంలో సుమారు 25 పీఠాలుండగా, ప్రధానంగా ఐదు ప్రధాన పీఠాల వద్ద సంబరాలు జరుగుతాయి. ఈ మాఘమాసంలో ఐదు వారాలు జాతర జరుగుతుండగా, వారానికి ఒక కుటుంబం వద్ద ఉన్న రాజమ్మతల్లి వద్ద పూజలు జరపడం ఆనవాయితీ. అయితే, ఈ సమయంలో అన్ని పీఠాల వద్దా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ తొలి వారం మైలపల్లి శ్రీనివాస్దాసు పీఠంలో పూజలు నిర్వహించనున్నారు. ఇంట్లో పుట్టిన వంశోద్ధారకుల తల వెంట్రుక (పుట్టుకొప్పు)లను ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుని ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు.

కుటుంబ సమిష్టి కృషికి సంకేతంగా..
మొక్కులు తీర్చుకునే భక్తులు కుటుంబ సమేతంగా ముందురోజు రాత్రికే చేరుకుని అక్కడే బస చేస్తారు. దీంతో నిర్వాహకులు వారికి తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఆదివారం ఉదయం అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం తన వెంట తీసుకువచ్చిన కోళ్లు, గొర్రెలను సమర్పించుకుంటారు. ఇక్కడే వంటలు చేసుకొని కుటుంబసమేతంగా విందు ఆరగిస్తారు. ఈ సమయం కుటుంబ సమిష్టి కృషికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. ఈ రెండు రోజులూ జాతర నిర్విరామంగా జరుతుంది. అలా అదివారం సాయంత్రానికి తిరిగి ఇంటిముఖం పట్టడంతో జాతర ముగుస్తుంది.
పోలీసులతో పటిష్ట బందోబస్తు..
వత్సవలస జాతరకు తొలివారం 150 మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐదు వారాల పాటు వరుసగా శని, ఆది వారాల్లో శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలను శ్రీకూర్మం కూడలి మీదుగా తూలుగు నుంచి వత్సవలస వరకు వన్వేను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం మీదుగా శ్రీకాకుళం వెళ్లేందుకు వన్వే ఉంటుంది.



Click it and Unblock the Notifications












