కలియుగ వైకుంఠ దైవమైన తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివెళ్తుంటారు. తిరుమలలో స్వామివారికి పెద్దపీట వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వీటితోపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేసినట్లు తెలిపారు. నేడు జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో ధర్మారెడ్డి సమాధానాలు చెప్పారు.
మే నెలలో సెలవుల కారణంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తామని, యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు కూడా తిరుమల దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. వీటితోపాటు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఇచ్చే సిఫార్సు లేఖలను కూడా రద్దు చేసినట్లు వివరించారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలనేవి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశామని తెలిపారు. అంతేకాదు వేసవిలో కొండపైకి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహారం, మజ్జిగను అందజేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు..
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా షెడ్స్, కూలెంట్లు, కార్పెట్లతో పాటు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నామన్నారు. ఇక, తిరుమల ఆలయంలోని క్యూలు, కంపార్ట్మెంట్లలో నిరంతరం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయ మాడవీధుల్లో, నారాయణగిరి గార్డెన్స్, ఆలయ పరిసరాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయం మాడవీధుల్లో చలువ పందిళ్లతోపాటు కూల్ పెయింట్లు కూడా వేసినట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

పద్మావతి పరిణయోత్సవాలు..
తిరుమలలో ఈ నెల17వ తేది నుంచి 19 వరకు పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. ఇక, ఈ నెల 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి 23 వరకు తిరుచానూరులో వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. మే 22న స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ మరుటి రోజు అంటే మే 23న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పత్ర పుష్ప యాగం ఉంటుంది. ఈ నెల 27-29 వరకు శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. అనంతరం మే 28న స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది. మే 23న తాళ్లపాక, తిరుపతిలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలు..
వచ్చేనెల (జూన్) 1వ తేది నుంచి 5వ తేది వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు కూడా ఆకాశ గంగ దగ్గర ఉన్న బాలాంజనేయ స్వామి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, ఏడో మైలు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ ఆలయాల్లో నిర్వహిస్తారు. అలాగే జూన్ 2న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం, నాద నీరాజనం వేదికలో ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని తెలిపారు..



Click it and Unblock the Notifications













