హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ హిందూ దేవుళ్ళు, దేవతలు, బుద్ధుడు, ప్రధాన ముస్లిం సన్యాసుల కు చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఇది అస్సాం రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల అందుబాటులో ఉంది, బాగా ప్రసిద్ది చెందింది. ఈ చిన్న పట్టణం అస్సాం కామరూప్ జిల్లాలోని శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.
హజో చరిత్ర గురించి అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఈ చిన్న పట్టణం ముఘలుల పరిపాలన తరువాత వచ్చిన కోచ్ వంశీయుల రాజధాని అని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా, హజోని వేరువేరు పేర్లతో పిలవడం జరిగింది. 11 వ శతాబ్దంలో ఇది అపుర్నభవ, మనికూట అని, 18 వ శతాబ్దంలో మనికుత్గ్రం అని పిలవబడింది. మరోవైపు, బుద్ధుడు హజో వద్ద నిర్వాణం పొందాడని బౌద్ధులు భావిస్తున్నారు.
చిత్రకృప : Jugal Bharali
హయగ్రీవ మహాదేవ ఆలయం
చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణించి ఆలయ ప్రాంగణం చేరుకోవటంతో- అలసట కాస్తా కనుమరుగవుతుంది. ఎతైన మెట్ల దారిగుండా వెళితే కనుచూపు మేరలో హయగ్రీవ మహాదేవ ఆలయం. ఈ ఆలయం హిందువులకూ, బౌద్ధులకూ పవిత్ర క్షేత్రం. ఒరిస్సాలోని జగన్నాథ ఆలయాన్ని పోలినట్టు ఉండే ఈ ఆలయంలో విష్ణువు - బుద్ధుడు కొలువుతీరి ఉంటారు.
ప్రతి ఏటా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలతోపాటు ప్రధాన హిందూ పండుగలూ జరుగుతాయి. ఆ వాతావరణం ఒక్కసారి చూసి తీరాల్సిందే. ఎందుకంటే- బౌద్ధ సన్యాసులతో.. హిందూత్వ ప్రముఖులతో కిక్కిరిసి ఉండటం. సామాన్య ప్రజానీకానికి అదొక వేడుక. బుద్ధుడు ఇక్కడే నిర్వాణం పొందాడని బౌద్ధ మతస్థుల విశ్వాసం.
హయగ్రీవ మహాదేవ ఆలయాన్ని పూర్వం 'కాలాపహార్' అనే మహారాజు ధ్వంసం చేసినట్టు చరిత్ర కథనం. క్రీ.శ.1543 ప్రాంతంలో కోచ్ మహారాజు రఘుదేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆ ఆలయానికి సమీపంలోనే చిన్న దేవాలయం ఉంటుంది. దీన్ని అహోమ్ మహారాజు ప్రమథ సింగ్ నిర్మింపజేశాడు.
చిత్రకృప : Junak4u
భీమర్ చారియా
హయగ్రీవ మహాదేవ ఆలయానికి కొద్ది దూరంలో ఉందీ ప్రాంతం. పురాణేతిహాసాల ప్రకారం - పూర్వం పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని ఇక్కడ గడిపారనటానికి దాఖలాలు కనిపిస్తాయి. ఇప్పటికీ అక్కడ పెద్ద రాతి పాత్రని చూడొచ్చు. ఆ పాత్రలో దిగటానికి మెట్లు కూడా ఉంటాయి. భీమసేనుడు ఈ పాత్రలో భుజించేవాడని కొందరు.. స్నానం చేసేవాడని కొందరు.. ఇలా వారివారి ఊహలకు తగ్గట్టు కథలు అల్లినప్పటికీ - పాండవులు ఇక్కడ నివసించారనేది మాత్రం స్పష్టం.
పోవ మక్కా
హజో అస్సాం ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం. క్రీ.శ.12వ శతాబ్దంలో ఇరాక్ రాజు పిర్ ఘియాసుద్దీన్ అలియా ఇక్కడ ఒక మసీదు నిర్మాణాన్ని చేపట్టాడు. ఘియాసుద్దీన్ భారతదేశంలో పర్యటిస్తూ ఈ ప్రాంతం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటంతో.. ప్రార్థనలకు అనువుగా ఉంటుందని మసీదుకి రూపకల్పన చేశాడని అంటారు.
చిత్రకృప : Pearlblack15
ఆ తర్వాతి కాలంలో అంటే క్రీ.శ.1657లో మొగల్ రాజు షాజహాన్ నేతృత్వంలో మిర్ లుతుఫుల్లా-హి- షిరాజీ అనే వ్యక్తి ఈ మసీదుకి మరిన్ని మెరుగులు దిద్దాడు. ఇక్కడ ఘియాసుద్దీన్ సమాధిని చూడటమే కాకుండా- ఆయన ఇస్లాం మత వ్యాప్తికి ఎంతటి కృషి సల్పాడో సవివరంగా రాతిపై చెక్కబడింది. మక్కా నుంచి కొంత మట్టిని తెచ్చి ఈ మసీదు నిర్మాణంలో వాడారని ఒక కథనం.
హజో లో మరికొన్ని ఆకర్షణలు : కేదారేశ్వర ఆలయం - శివునికి అంకితం చేయబడింది, గణేశ ఆలయం, జాయ్ దుర్గా ఆలయం, దోపర్గుడి సత్రం మొదలగునవి.
చిత్రకృప : Junak4u
హజో చేరుకోవటం ఎలా?
విమాన మార్గం
న్యూఢిల్లీ నుంచీ కోల్కతా, ముంబై, చెన్నై, జోర్హత్, తేజ్పూర్, దిబూఘర్, దక్షిణ లఖింపూర్, సిల్చార్ ప్రాంతాల నుంచి గౌహతికి ఫ్లైట్ సర్వీస్ ఉంది. ఇక్కడి నుంచి హజో 17 కి. మీ. దూరంలో ఉన్నది.
రైలు సదుపాయం
హజోకి 23 కి. మీ. దూరంలో గౌహతి జంక్షన్ రైల్వే స్టేషన్ కలదు. ఈ జంక్షన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలచేత అనుసంధానించబడినది.
రోడ్డు మార్గం
గౌహతి నుంచి నిరంతరం హజోకి బస్సు సర్వీసులు నడపబడతాయి.