అమర్నాథ్ యాత్రకంటే కష్టమైన ఈ యాత్రకు వెళ్లారా?
మంచుకొండల్లో మహాశివుని దర్శనం కోసం సాగే యాత్ర అంటేనే అందరికి అమర్నాథ్ యాత్ర అనుకుంటారు. అమర్ నాథ్ యాత్ర ఎంతో సాహసంతో కూడుకున్నది. అంతకు మించి సాహసంతో, శ్రమతో కూడుకున్న యాత్ర మరొకటి ఉంది. అదేంటంటారా? అదే శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర కంటే ఎంతో కఠినమైనదిగా భావించే శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ఈ ఏడాది జూలై 7న ప్రారంభవుతుంది.
శిమనామస్మరణతో యాత్ర..
హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలోని అని నుండి శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కోసం మాతా అంబిక ఛదీ యాత్ర ప్రారంభమయ్యింది. సముద్రమట్టానికి 18, 570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తుంటారు. కులు జిల్లాలోని నిర్మండ్ బ్లాక్లోని సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉన్న సింఘాడ్ బేస్ క్యాంప్ నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఎంతో ఎత్తులో ఉన్న ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు ఓం నమఃశివాయ అంటూ నామస్మరణం చేస్తూ వారి యాత్రను కొనసాగిస్తారు.

ఈ శివలింగ దర్శనానికంటే ముందే 50 అడుగుల దూరంలో పార్వతీదేవి, గణేషుడు, కార్తికేయ స్వామి వార్లను దర్శించుకోవచ్చు. గత సంవత్సరాల్లో అల్పోష్ణస్థితి కారణంగా అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినందున, ఈ సంవత్సరం యాత్రికులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం జులై 15 తర్వాత పాదయాత్ర ప్రారంభమయ్యేది. అయితే ఈ ఏడాది జూలై 7న పాదయాత్రను ప్రారంభించి జులై 20న శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు అధికార యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసింది.
మంచుతో కప్పబడి ఉంటుంది..
ప్రకృతి నడుమ సాహసంతో కూడుకున్న ఈ తీర్థయాత్ర కోసం సింఘడ్, థాచ్రు, కున్షా, భీంద్వారి మరియు పార్వతీబాగ్లలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రతి శిబిరం వద్ద, అడ్మినిస్ట్రేషన్ ఒక సెక్టార్ మేజిస్ట్రేట్ కింద మెడికల్, రెస్క్యూ మరియు పోలీసు బృందాలను ఉంచింది. ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో మంచు కురిసినా ఈ శివలింగంపైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగిపోతుందని వారు చెబుతుంటారు. అద్భుతమైన పుష్పాలతో సందర్శకులని ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో బాగం శ్రీఖండ్ మహాదేవ్.

సాహసంతో కూడుకున్న యాత్ర..
ఈ యాత్ర కోసం వచ్చే భక్తులకు ఇది ఒక సాహసయాత్ర. ఎందుకంటే ఎత్తుకు ప్రయాణించే కొద్ది సరిగా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొందరు భక్తులు త్వరగా అలసిపోతారు. అమర్నాథ్ యాత్రలోలాగా ఈ యాత్రలో సౌకర్యాలు లేవు. గత సీజన్తో పోలిస్తే, ఈసారి హిమపాతం మరియు శీతాకాలం ఎక్కువ కాలం కొనసాగినందున ఈసారి మార్గం మరింత కష్టం.
ఎలా వెళ్లాలి..
సిమ్లా నుండి రాంపూర్కు 130 కిలోమీటర్లు దూరం ఉంటుంది. రాంపూర్ నుండి నిరామండ్కు 17 కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత, నీరమండ్ నుండి బాగిపుల్కు 17 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గంగూలీ చేరుకున్న తరువాత, 12 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. తర్వాత 25మీటర్లు నేరుగా ట్రెక్కింగ్ చేస్తూ శ్రీఖండ్ ను చేరుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ చేయడం భక్తులకు ఓ సవాలనే చెప్పుకోవాలి. ఇది ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఈ ప్రయాణంలోనే భక్తులు ఆనారోగ్య సమస్యలకు గురవుతారు.



Click it and Unblock the Notifications












