విశాఖ నగరంలో వెలసిన బెల్లం వినాయకుడిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి చేరుకుంటారు. అంతటి ఖ్యాతి గాంచిన విశాఖ పాతనగరం అఫిషియల్ కాలనీ మూడో వీధిలో కొలువైన బుచ్చి రామలింగేశ్వర (వైశాఖేశ్వర) స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న బెల్లం గణపతి (ఆనంద గణపతి)కి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం రండి!
ఏటా వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విశాఖ నగరంలోని బెల్లం వినాయకుని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడ ప్రతి సోమ, బుధవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

11వ శతాబ్దానికి పూర్వం..
ప్రతి పురాతన ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బెల్లం గణపతి ఆలయం అందుకు మినహాయింపు కాదు. ఈ ఆలయంలో వినాయకుని తొండం కుడి వైపునకు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇఆ కుడి వైపున తొండం ఉన్న వినాయకుని పూజిస్తే సకల కార్యాలూ సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ బుచ్చిరామలింగేశ్వర స్వామి ఆలయం 11వ శతాబ్దానికి పూర్వం సముద్రంలో కలిసిపోయిన వైశాఖేశ్వరుని ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వెలసిందని చెబుతారు. అంతేకాదు, యుక్త శుభలగ్నంలో దేవతలు వైశాఖేశ్వరుడిని ప్రతిష్ఠించడంతో స్వామివారికి బుచ్చిరామలింగేశ్వర పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే, ఇక్కడి స్వామివారిని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది.
ఆగ్నేయ ముఖంగా ఆలయం..

ఆగ్నేయ ముఖంగా ఆలయం..
నిజానికి, శివాలయాలు తూర్పు ముఖంగా ఉండడం ఆనవాయితీ ఉంది. కానీ, ఈ ఆలయం ఆగ్నేయ ముఖంగా ఉండడం ద్వారా ప్రత్యేకతను చాటుకుంది. ఈ పురాతన ఆలయానికి చెందిన పూర్తి వివరాలు తంజావూరు కేంద్ర గ్రంథాలయం, ఏయూ గ్రంథాలయంలో ఉందని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయంలో వెలుగుచూసింది. ఇక్కడి ఉప ఆలయాల్లో ఆనంద గణపతి (బెల్లం వినాయకుడు), జ్ఞానముద్ర సమేత త్రిశక్తి అన్నపూర్ణదేవి కొలువై భక్తులను ఆకర్షిస్తున్నారు. అన్నపూర్ణదేవి కమలంపై కూర్చొని.. చేతులు జ్ఞాన ముద్రలో ఉండడంతోపాటు జపమాల ఉండడంతో త్రిశక్తిగా పేరుగాంచింది. బుచ్చిరామలింగేశ్వరస్వామి ఆలయంలో మరో ఉపాలయంగా సూర్యభగవానుడు సర్పం నీడన, జింక వాహనంపై దర్శనమిస్తారు.
మహా అన్నదాన కార్యక్రమం..
ఈ ఆలయ ప్రాంగణం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందంగా ముస్తాబయింది. ప్రతిరోజు అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 18న మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శత్రువుల నుంచి భక్తులను, నగరాన్ని రక్షించేందుకు ఇక్కడ స్వామివారు వెలిశారని చెబుతోన్న ఆ బెల్లం వినాయకుడిని దర్శించుకునేందుకు మీరూ సిద్ధమవ్వండి.



Click it and Unblock the Notifications












