శ్రీశైల దేవస్థానంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూశారా..?
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదవే లేదు. ఇటు ఉత్తరాంధ్రలో కానీ, అటు రాయలసీమలో కానీ ఎటుచూసినా అన్నీ ఆధ్యాత్మిక క్షేత్రాలే.. ముఖ్యంగా ఏపిలోని రాయలసీమలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటేమిటి, చిత్తూరులోని తిరుపతి వెంకటేశ్వరరామి దేవాలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, యాగంటి, మహానంది, మంత్రాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాయలసీమ చుట్టూ అన్నీ పుణ్యక్షేత్రాలే...అయితే శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను ఎప్పుడైనా చూశారా? వాటినీ చూడాలంటే ఎక్కువ ఖర్చయిపోతుందని భయపడుతున్నారా? అలాంటి భయమేమీ వద్దు. తక్కువ ఖర్చుతోనే శ్రీశైల సమీపంలోని వీటిని చూసేయ్యండి..

ఐదు పుణ్యక్షేత్రాలు..
శ్రీశైలం సమీపంలో ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. అందులో మల్లమ్మ కన్నీరు, గోశాల, శివాజీ కోట, మఠాలు, అటికేశ్వరం, పాలధార పంచదార, నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్, రుద్ర పార్క్, చెంచులక్ష్మి మ్యూజియం వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ సందర్శించేందుకు చాలా ప్రదేశాలే ఉన్నాయి. అయితే, ఈ దర్శనీయ ప్రాంతాలన్నింటిని చాలా తక్కువ ధరకే వీక్షించొచ్చు. అది కూడా ఆటోలో ప్రయాణం. వీటన్నింటిని చూసేయలంటే ప్రతి ఒక్క భక్తుడు 120 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒక మనిషి 120 రూపాయలతో ఈ ఐదు పుణ్యక్షేత్రాలను సందర్శించేయొచ్చు. మరెందుకాలస్యం... నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రయాణానికి సిద్ధం కండి..
కేవలం రూ. 120తో చూడొచ్చు..
ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలంటే బస్సు వసతి కానీ, సొంత వాహనాలు కానీ ఉండాలి అనే ఒక భ్రమలో ఉంటారు చాలామంది. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడికి ఎదురుగా ఒక సర్కిల్ ఉంది. దానినే నంది సర్కిల్ అని అంటారు. అక్కడ సుమారుగా ఒక 310 ఆటోలు క్యూలో ఉంటాయి. దేవస్థానం సందర్శన కోసం వచ్చిన యాత్రికులకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూపించేందుకు ఈ ఆటోలు అందుబాటులో ఉంటాయి. అది కూడా అతితక్కువ ధరలకే. ఒకరికి రూ. 120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అక్కడినుంచి ఇంకాస్త దూరం వెళ్లాలంటే మాత్రం మనిషికి రూ. 150 చొప్పున తీసుకుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఆటోలో తిప్పి చూపిస్తారు.

మల్లమ్మ మందిరం.
అయితే ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా హేమారెడ్డి మల్లమ్మ మందిరం ఎంతో ప్రాముఖ్యతను చాటుకుంది. ఈ మందిరం శ్రీశైలం ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరాన్ని అత్యంత పెద్ద స్తంభాలతో నిర్మించారు. గుడి లోపల హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం పక్కన ఇప్పటికీ నీరు కారుతూనే ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు. మల్లమ్మ మల్లికార్జున స్వామి పరమ భక్తురాలు. మల్లమ్మ కథ క్రీస్తు పురం 14వ శతాబ్దం నాటిదని పూర్వీకులు చెబుతున్నారు.
ఇతర రాష్ర్టాల వారు కూడా..
రెండు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇక్కడికి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఆటో సౌకర్యం గురించి తెలియక చాలామంది ఈ పుణ్యక్షేత్రాలను చూడకుండానే తిరుగు ముఖం పడతారు. అలా కాకుండా శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు నంది సర్కిల్లో ఉన్నఈ ఆటోలను వినియోగించుకుని చుట్టుపక్కలున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించొచ్చు.



Click it and Unblock the Notifications













