ప్రకృతి ఒడిలో దాగిన ఈ అందాలను చూశారా?
ఉత్తర భారతదేశంలోని కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. పశ్చిమ హిమాలయాల ఒడిలో ఉన్న భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక రాష్ట్రం ఈ ప్రాంతం. ప్రకృతి ఒడిలో గూడుకట్టుకుని, లోయలు, పచ్చికభూములు, పచ్చని అడవులు, దట్టమైన చెట్లతో కూడిన తోటలు, విశాలమైన పైన్లు, ప్రవహించే నదులు, శక్తివంతమైన సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలతో నిండి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వేళ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. సిమ్లా, మనాలి ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ రాష్ట్రంలో కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే మాత్రం వీటిని మిస్ అవ్వకండి..రండి ఆ ప్రదేశాలెంటో చూద్దాం..

తీర్థన్ లోయ
హిమాచల్లోని తీర్థన్ వ్యాలీ ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ అందమైన దృశ్యాలను ఆస్వాదించడమే కాకుండా, నది ఒడ్డున క్యాంపింగ్, ఫిషింగ్ కూడా చేయొచ్చు. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కర్లకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదనే చెప్పుకోవాలి. తీర్థన్ లోయ హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఉన్న ఏకాంత లోయ. మనాలి వంటి ప్రాంతంలోని ఇతర ప్రసిద్ధ ప్రదేశాలతో పోలిస్తే, తీర్థన్ లోయ ప్రకృతి సౌందర్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ లోయ లార్జీ గ్రామం వద్ద మొదలవుతుంది. ఢిల్లీ-మనాలి హైవేకి దగ్గరగా ఉంటుంది.

బారోట్ వ్యాలీ
మండి జిల్లాలో ఉన్న బారోట్ వ్యాలీ హిమాచల్ప్రదేశ్లోని చాలా అందమైన ప్రదేశం. ఇది పచ్చని అడవులు, వంకర నదులు, సుందరమైన దృశ్యాలకు ప్రసిద్ధి. క్యాంపింగ్, ట్రెక్కింగ్ చేసేందుకు అనువైన ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన గమ్యస్థానం. బారోట్ లోయ ట్రౌట్ ఫిషింగ్కు కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సహజ దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

చిత్కుల్
చిత్కుల్ కిన్నౌర్ జిల్లాలోని ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి జనావాస గ్రామం. ఇది మంచుతో కప్పబడిన పర్వతాలతో ఉంటుంది. ఈ ప్రాంతం సాంప్రదాయ కిన్నౌరి వాస్తుశిల్పాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి బాస్సా నది అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. హైకింగ్ చేసేందుకు ఈ ప్రాంతం అనువైనది. హిమాలయాల సహజమైన అందాలను వీక్షించాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతానికి రావాల్సిందే.

మలానా
పార్వతి లోయలో నెలకొని ఉన్న మలానా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. దీనిని "విలేజ్ ఆఫ్ టాబూస్" అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకమైన ఆచారాలు,సంప్రదాయాలు మలానా క్రీమ్కు ప్రసిద్ధి చెందింది. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో ఉత్తమం. హిమాచల్ ప్రదేశ్లోని పురాతన గ్రామమైన మలానాలో అనేక రహస్యాలు ఉన్నాయి. పార్వతి లోయ పక్కన ఉన్న ఇది చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలతో కలవని ఏకాంత గ్రామం. తియ్యని పచ్చదనంతో, మంచుతో కప్పబడిన పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంటుంది ఈప్రాంతం. మలానా సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉంది.

కల్ప
కల్ప అనేది హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. సముద్ర మట్టానికి 2758 మీటర్ల ఎత్తులో ఉన్న కల్ప, గతంలో కిన్నౌర్ ప్రాంత ప్రధాన కార్యాలయం. ఇది ఆపిల్ తోటలు, సాంప్రదాయ చెక్క ఇళ్ళు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. కల్ప ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడి సూర్యోదయ, సూర్యస్తమయ దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.



Click it and Unblock the Notifications













