రాజస్థాన్లో పర్యాటకులు సందర్శించేందుకు అనేక ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలలో సవాయి మాధోపూర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రాంతంలో పర్యాటకులు వీక్షించేందుకు ప్రసిద్ధిచెందిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. ఇక్కడ ఎందరో సెలబ్రిటీలు వివాహాలు కూడా చేసుకున్నారు. బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్న ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ రణథంబోర్ నేషనల్ పార్క్ మాత్రమే కాకుండా, ఇంకా పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. రాజస్థాన్ చరిత్రతో పాటు ప్రకృతి అందాలకు ఆకర్షితులయ్యే పర్యాటకులకు సవాయి మాధోపూర్ సరైన పర్యాటక ప్రదేశం.
రణతంబోర్ నేషనల్ పార్క్
భారతదేశంలోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలలో రణతంబోర్ నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడ ప్రధానంగా రాయల్ బెంగాల్ టైగర్ల పాలన ఉంటుంది. అంతేకాకుండా ఈ పార్క్లోని అనేక ఇతర ఆకర్షణలలో చిరుతపులి, మొసలి ఇతర చిన్న చిన్న జంతువుల సంరక్షణ కూడా జరుగుతుంది. శీతాకాలంలో ఈ జాతీయ పార్కులో పెద్ద సంఖ్యలో వలస పక్షులు కూడా పర్యాటకులను కనువిందు చేస్తాయి. ఈ జాతీయ ఉద్యానవనం అనేక జాతుల పక్షులకు నిలయంగా ఉంది.

టైగర్ సఫారీ
రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ పర్యటనకు వెళ్లేవారు టైగర్ సఫారీ చేయకుండా ఉండలేరు. వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ ప్రదేశం ఎంతో ఉత్తమమైనది. రణతంబోర్ నేషనల్ పార్క్లో టైగర్ సఫారీ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ టైగర్ సఫారీ ప్రధానంగా జీప్ ద్వారా జరుగుతుంది. ఈ సఫారీ సమయంలో పసుపు చారల రాయల్ బెంగాల్ టైగర్ను కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇతర జంతువులతో పాటు వాటి సహజ వాతావరణంలో చూసిన అనుభవం చాలా ప్రత్యేకమైనది.
రణతంబోర్ కోట
సవాయి మాధోపూర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణ జాతీయ పార్క్ లోపల ఉన్న రణతంబోర్ కోట. ఈ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చబడింది. ఎత్తైన కొండపై ఉన్న ఈ కోట రాజస్థాన్ రాజరిక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కోట నుండి చుట్టుపక్కల ప్రాంతంతో పాటు మొత్తం నేషనల్ పార్క్ దృశ్యాన్ని వీక్షించొచ్చు.

వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ
రణథంబోర్ నేషనల్ పార్క్ ప్రకృతి దృశ్యాలను మీ మీ కెమెరాల్లో బందించొచ్చు. ఈ ప్రాంతంలో చుట్టూ చెట్ల వరుసలు, దట్టమైన అడవులు మాత్రమే ఉన్న వాతావరణంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తేలికపాటి ఉదయపు సూర్యకాంతిలో, ఎక్కడి నుండైనా పక్షుల కిలకిలారావాలు తప్ప మరే ఇతర శబ్దం ఇక్కడ చేరదంటే నమ్మండి.
ఎక్కడ ఉండాలి
సవాయి మాధోపూర్లో బస చేసేందుకు అనేక హోటళ్లు, రిసార్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ హోటళ్లలో కొన్ని రణతంబోర్ నేషనల్ పార్క్ ప్రాంతం చుట్టూ ఉన్నాయి. ఈ అడవిలో పర్యాటకులకు క్యాంపింగ్ పూర్తి అనుభవాన్ని అందిస్తుంది. ఈ సెలవుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే మాత్రం ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సవాయి మాధోపూర్ సందర్శించడానికి ఉత్తమ సమయం
శీతాకాలం రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వేసవిలో చాలా తేమతో కూడిన వేడి ఇక్కడ ఉంటుంది. ఇది సెలవుల ఆనందాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. కానీ, రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ వాతావరణం ఏడాది పొడవునా బాగానే ఉంటుంది. అయితే సవాయి మాధోపూర్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్య ఉంటుంది.



Click it and Unblock the Notifications













