విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా రావడం సహజం. అయితే, ఈ ఆలయంలో మాత్రం వినాయకుని దగ్గరకు చేరుకుని, తమ కోరికలను స్వామివారి చెవిలో చెబుతారు. అంతేకాదు, ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. అలాంటి నేపథ్యం ఉన్న పురాతన గణేశుడి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. వినాయక చతుర్థి పురస్కరించుకుని ఆ ఆలయ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండి!
వినాయకుని ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయ విశేషాలు అమితంగా ఆకట్టుకుంటాయి. 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కొలువైన ఇక్కడి గణనాథుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండడంతో ఈ గణనాథుడికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా.. ఈ ఆలయంలోని గణేశుని చెవిలో భక్తలు తమ కోరికలు చెబితే తప్పకుండా నెరవేరుతాయని వారి నమ్మకం. అలా తమ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత పునః దర్శనంతో వారి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా..
కోరికలను చెవిలో చెబితే తీర్చే స్వామిగా భక్తుల నమ్మకాన్ని పొందిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 1100 సంవత్సరాల చర్రిత కలిగిన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా భక్తులను కనువిందు చేస్తారు. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదిగా భావిస్తున్నారు.
అలనాటి కాలంలో రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఏ పనులు ప్రారంభించినా అవి సకాలంలో పూర్తయ్యేవట. అలా అదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ.. భక్తులు స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఇక్కడి వినాయకుని విగ్రహం కాలక్రమేణా భుస్థాపితం అయింది. అలా 19వ శతాబ్దంలో పంట పొలాల్లో వ్యవసాయం చేస్తున్న సమయంలో రైతులు దీనిని గుర్తించారు. విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు.

9 రోజులు నిర్విరామంగా..
అలా బిక్కవోలులో స్వయంభుగా వెలసిన గణపతి ఆలయంలో ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా స్వామివారి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక ఉత్సవాలు 9 రోజులు నిర్విరామంగా జరపనున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయానికి భక్తులు దూరప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ముడుపులు కడతారని తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆ వినాయకుని ఆలయం కారణంగా తమ గ్రామం ఎంతో ప్రసిద్ధి పొందిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయానికి చేరుకుని మీ కోరికలను స్వామివారి చెవిలో చెప్పేయండి మరి!



Click it and Unblock the Notifications













