మళ్ళీ కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) ఆదివారం, సెప్టెంబర్ 6న పూర్తిగా మూతపడింది. రాంబన్ పరిధిలోని మేహద్ ప్రాంతంలో రహదారిపైకి నిరంతరాయంగా రాళ్ళు పడుతుండటంతో రవాణా నిలిచిపోయింది. దీంతో అధికారులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా కాశ్మీర్ పర్యటనకు వెళ్ళే పర్యాటకులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ టూర్ ప్లాన్స్ వేసుకున్న వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు.
ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఇరువైపులా సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. బనిహాల్ దగ్గర్లోని తబేలా చమల్వాస్ వద్ద కూడా కొండచరియలు విరిగిపడినట్లు ముందస్తు హెచ్చరికలు చెబుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించేవారు లైవ్ అప్డేట్స్ కోసం ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. జమ్మూ: 0191‑2459048, శ్రీనగర్: 0194‑2450022, రాంబన్: 9419993745 నంబర్లకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకోవచ్చు.

ముఘల్ రోడ్డు పరిస్థితి.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
వాతావరణం సహకరిస్తే ముఘల్ రోడ్డు ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం పూంచ్-షోపియాన్ మధ్య ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు వైపులా వాహనాలకు అనుమతి ఉంది. మొదట చిన్న వాహనాలు, ఆ తర్వాత పది టైర్ల వరకు ఉన్న భారీ వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే రాజౌరి, పీర్ కీ గలీ మార్గంలో ఎత్తైన కొండ ప్రాంతాలు ఉండటంతో వాతావరణంలో మార్పుల వల్ల ప్రయాణ సమయం కాస్త ఎక్కువ పట్టే అవకాశం ఉంది.
జమ్మూ, శ్రీనగర్, కత్రా వెళ్ళే వారికి విమాన, రైలు మార్గాలు
అత్యవసర ప్రయాణాలు ఉన్నవారు విమానాలను ఎంచుకోవడం మంచిది. హైవే పునరుద్ధరించే వరకు శ్రీనగర్కు టికెట్లు రీబుక్ చేసుకోవడం లేదా జమ్మూ వరకు ఫ్లైట్లో వెళ్లి అక్కడ స్టే చేయడం మేలు. ఇక శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వెళ్లే భక్తులు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. ప్లానింగ్లో జమ్మూ లేదా శ్రీనగర్లో ఒక రాత్రి అదనంగా ఉండేలా చూసుకోండి. టికెట్లలో మార్పులు లేదా ఇన్స్టంట్ సీట్ బుకింగ్స్ కోసం ఎయిర్లైన్ యాప్లను వాడండి.
వాతావరణ సూచనలు.. కొండ ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణ చిట్కాలు
ఒకవేళ మీరు ఎక్కడైనా మధ్యలో చిక్కుకుపోతే.. ఉధంపూర్, పట్నీటాప్, రాంబన్, బనిహాల్ లేదా ఖాజీగుండ్ వంటి సౌకర్యాలున్న పట్టణాల్లోనే ఆగడం సురక్షితం. మీ వద్ద సరిపడా మంచి నీళ్ళు, పొడి ఆహారం, వెచ్చని దుస్తులు, పవర్ బ్యాంకులు, మెడిసిన్ కిట్, రిఫ్లెక్టర్లు ఉంచుకోండి. రాళ్ళు పడే ప్రమాదం ఉన్నందున రాంబన్-బనిహాల్ మధ్య రాత్రివేళ ప్రయాణాలు అస్సలు చేయవద్దు. మట్టిపెళ్ళలు పడిన ప్రాంతాల వద్ద ఓవర్టేక్ చేయకుండా లేన్ క్రమశిక్షణ పాటించండి. మరమ్మతులు జరుగుతున్న చోట వాహనం హెడ్లైట్లను లో-బీమ్లోనే ఉంచండి.
ఈ వారం మధ్యనాటికి వాతావరణం అనుకూలించి రహదారి మరమ్మతులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం సెప్టెంబర్ 6 నుండి 8 వరకు శ్రీనగర్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం బాగున్నా కొండ ప్రాంతాల్లో పగటిపూట మాత్రమే ప్రయాణించండి. దల్వాస్, దేవుల్ ప్రాంతాల్లో అక్కడక్కడా ఒక్క లేన్ మాత్రమే అందుబాటులో ఉన్నందున జాగ్రత్తగా వెళ్ళండి. సుదీర్ఘ ప్రయాణాలకు బయలుదేరేముందు ప్రతీ కొన్ని గంటలకొకసారి ట్రాఫిక్ అప్డేట్స్ సరిచూసుకోవడం మర్చిపోకండి.



Click it and Unblock the Notifications











