త్వరలో బిన్సార్ అభయారణ్యంలో జంగిల్ సఫారీ... మీరు సిద్ధమేనా...
కాలుష్యం, రోజువారీ శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉత్తరాఖండ్లోని బిన్సార్ అభయారణ్యం ఈ సీజన్లో పర్యాటకులు సందర్శించేందుకు ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఉంది. బిన్సార్ అభయారణ్యం, చుట్టూ దట్టమైన దేవదారు అడవులు ఉంటాయి. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. బిన్సార్ అభయారణ్యంలో త్వరలో జంగిల్ సఫారీ కూడా ప్రారంభం కానుంది. అంతేకాదు, పర్యాటకులు బిన్సార్ అభయారణ్యంలో బైక్ రైడింగ్ను కూడా ఆస్వాదించొచ్చు. మరెందుకాలస్యం బిన్సార్ అభయారణ్యాన్ని సందర్శించేందుకు బయలుదేరండి మరి..

ఎన్నోఅడవి జంతువులకు నిలయం..
బిన్సార్ అభయారణ్యంలో పర్యాటకుల కోసం జంగిల్ సఫారీ, బైక్ రైడింగ్ వంటి వాటిని త్వరలో ప్రారంభించాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటివరకు పర్యాటకులు కాలినడకన అడవిని అన్వేషించేవారు. ఇలా చూడడం వల్ల అడవి జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అందుకే, అటవీ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిన్సార్ అభయారణ్యం చిరుతపులి, జింకలు, కస్తూరి జింకలు, ఎలుగుబంటి, అడవి పంది వంటి వివిధ రకాల అడవి జంతువులకు నిలయం. ఇప్పటి వరకు, జిమ్ కార్బెట్ టైగర్ అభయారణ్యంలో మాత్రమే జంగిల్ సఫారీ, బైక్ రైడింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు బిన్సార్ అభయారణ్యంలో కూడా జంగిల్సఫారీ, బైక్రైడింగ్ వంటి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది పర్యాటకులకు ఎంతో శుభవార్త.

జంగిల్ సఫారీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది..
అటవీ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని సమాచారం. బిన్సార్ అభయారణ్యంలో జంగిల్ సఫారీ, బైక్ రైడింగ్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించేందు దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అయితే, మరో 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దీపర్ సింగ్ మాట్లాడుతూ.. బిన్సార్ అభయారణ్యంలో జంగిల్ సఫారీ ప్రారంభం కావడం చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. అలాగే, దీంతో పాటు కాసర్ దేవి ఎకో పార్క్లో బైక్ రైడింగ్ను కూడా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. జంగిల్ సఫారీ, బైక్ రైడింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ పర్యాటకం మరింత పుంజుకుంటుందని డివిజనల్ ఫారెస్ట్ అఫీసర్ అన్నారు.

జీరో పాయింట్...
బిన్సార్ అభయారణ్యంలో పర్యాటకులు ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ట్రెక్కింగ్ చేసుకుంటూ జీరో పాయింట్కి చేరుకోవాలి. జీరోపాయింట్లో కనిపించే దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పర్యాటకులు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేసిన తర్వాత జీరో పాయింట్ చేరుకుంటారు. ఇంకా ఇక్కడ కేదార్నాథ్, శివలింగ్, త్రిశూల్, నందాదేవి శిఖరం వంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతమంతా చుట్టు చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ నుండి కుమావోన్ అందాలను కూడా వీక్షించొచ్చు.
పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామం..
పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఎందుకంటే ఈ అడవిలో 200 కంటే ఎక్కువ పక్షులు ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ చూడని పక్షులను కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఏటా ఈ అభయారణ్యాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, కస్తూరి జింకలు, ఎలుగుబంటి, అడవి పంది వంటి అనేక రకాల వన్యప్రాణులు అడవి నుంచి అప్పుడప్పుడు వచ్చి పర్యాటకుల ముందు ప్రత్యక్షమవుతుంటాయి.



Click it and Unblock the Notifications












