ఆంధ్ర ప్రదేశ్ లో దసరా ఒక ముఖ్య పండగ. ఇది శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండగ. ఈ పండుగనే శరన్నవరాత్రి, నవరాత్రి అని కూడా పిలుస్తారు. తెలుగువారు దసరా వేడుకలు జరుపుకోవడంలో ముందుంటారు. పది రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఆడతారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దసరా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కనకదుర్గ దేవాలయం. ఈ గుడి విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కలదు. ఇక్కడ రోజువారీ వచ్చే భక్తుల కన్నా, నవరాత్రి పర్వదినాలలో సందర్శించే భక్తుల సంఖ్య అధికం. తిరుపతి తర్వాత ఏపీలో రెండవ పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతిగాంచినది.

అమ్మవారు
ఇంద్రకీలుడనే మహర్షి దుర్గ దేవిని ప్రార్థించగా ... అమ్మవారు ప్రత్యక్షమై కోరిక కోరమని అడగగా, కీలుడు తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని కోరతాడు. అప్పుడు అమ్మవారు అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుదీరుతుంది. ఇక్కడ వెలసిన మహిసాశురమర్ధిని ఆమె కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.
చిత్రకృప : Srikar Kashyap

పాశుపతాస్త్రం
అంతేకాదు, అర్జునుడు ఈ కొండపై మహాశివుడు గురించి తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.
చిత్రకృప : Oleograph

గర్భగుడిలో
కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరమిట్లు గొలిపే ఆభరణాలు, గుబాళించే పూలతో అలంకరించబడి ఉంటుంది. శక్తి స్వరూపిణి ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిశాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది.

అమ్మవారి నవరాత్రి
అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలను తిలకించటానికి పెద్ద ఎత్తున భక్తులు దేశం నలుమూలల నుండి వస్తుంటారు.

ఒక్కో అవతారంలో ..
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ప్రతిరోజూ ఒక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆ తొమ్మిది అవతారాలు వరుసగా బాలాత్రిపురసుందరి దేవి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి, లలిత త్రిపుర సుందరి దేవి, సరస్వతి దేవి, దుర్గా దేవి, మహాలక్ష్మి దేవి, మహిషాసురమర్ధిని దేవి, రాజరాజేశ్వరి దేవి.

దుర్గాదేవి ఆలయంలో
దుర్గాదేవి ఆలయంలో చూడవలసినవి : భవానీ మండపం, అశ్వర్థ వృక్షం, ఆంజనేయస్వామి గుడి, మల్లేశ్వర స్వామి, నాగేంద్రస్వామి, లక్షకుంకుమార్చన స్థలం, శ్రీచక్రం పూజా స్థలం, కళ్యాణ మండపం, శంకరాచార్య మండపం, చండీ హోమం, వినాయకస్వామి, శ్రీరాముడు ఆలయాలు మొదలనవి చూడదగ్గవి.

అన్నదానం
కనకదుర్గ గుడిలో ఉచితంగా అన్నదానం నిర్వహిస్తారు. ప్రతిరోజు 5 వేల మందికి, దసరా ఉత్సవాల సమయంలో లక్షా 25 వేల మందికి అన్నదానం వడ్డిస్తారు.

ఫ్రీ గా
దేవస్థానంలో ఫ్రీ గా ప్రసాదం వడ్డిస్తారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదం భక్తులకు ఇస్తారు. ప్రసాదం : దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర, బెల్లం పొంగలి, శనగలు.
చిత్రకృప : MVishnuV

వసతి
దుర్గమ్మ గుడి వద్ద మాడపాటి గెస్ట్ హౌస్, ఇంద్రకీలాద్రి గెస్ట్ హౌస్ లు కలవు. ఏసీ, నాన్ - ఏసీ గదులు లభ్యమవుతాయి. ఇవేకాక, కొండ కింద, విజయవాడ నగరంలో అత్యాధునిక హంగులతో కూడిన హోటళ్లు కలవు. వసతి కై బెంగ అనవసరం.
విజయవాడ హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
చిత్రకృప : IAPEN Activities

ఎలా చేరుకోవాలి ?
విజయవాడలో వాయు, రైలు, బస్సు మార్గాలు చక్కాగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు, బస్సులు, విమానాలు వస్తుంటాయి. విజయవాడ బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళటానికి ఉచిత బస్సు సేవలు కలవు. కొండ మీదకు ప్రవేట్ ఆటోలు, టాక్సీలు కూడా వెళతాయి. కాలినడకన కూడా భక్తులు కొండపైకి చేరుకోవచ్చు.
చిత్రకృప : Ashwin Kumar



Click it and Unblock the Notifications












