ప్రతిరోజూ ఉరుకులు, పరుగులతో యాంత్రిక జీవితానికి అలవాటు అదే చట్రంలో ఇరుక్కుపోయిన నగరవాసులు ఆ బిజీ లైఫ్ నుంచి వారంలో ఒక్క రోజైనా విముక్తి పొందేందుకు ట్రెక్కింగ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారాంతాల్లో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలసి నగరానికి దూరంగా అడవుల్లో, పక్షుల కిలకిలలు,సెలయేళ్ల గలగలలు వింటూ ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కొంతమంది దూర ప్రాంతాలను ఎంచుకుంటే మరికొంత మంది నగరం చుట్టు పక్కల ప్రాంతాల కోసం వెతుకుతుంటారు. రెండో ఎంపిక కోరుకునే ప్రజల కోసం విజయవాడ సమీపంలోనే స్వర్గానికి దారులు పరిచే అద్భుతమైన ప్రదేశం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్.

ట్రెక్కింగ్ ప్రియుల మనసుదోచే.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్.. ఎటుచూసినా కొండకోనల సోయగాలు.. ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చే.. అద్భుతమైన అందాలతో కనువిందు చేసే ఆకుపచ్చని అటవీ ప్రాంతం.. ఇక్కడికి ఏటా వచ్చే ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని చేరువచేస్తాయి. మరీ ముఖ్యంగా ట్రెక్కింగ్ ప్రియుల మనసుదోచే వ్యూ పాయింట్స్ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో తారసపడతాయి. వర్షాకాలంలో మాత్రమే కొత్తసొగసులు అద్దుకున్న చిన్న చిన్న జలపాతాల సవ్వడులు ఇక్కడ దర్శనమిస్తాయి. సందర్శకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. అందుకే కాబోలు.. నిత్యం సెల్ ఫోన్ గేమ్స్కే పరిమితమవుతోన్న పిల్లలు.. పని ఒత్తిడితోపాటు కాలుష్యంతో సతమతమవుతోన్న నగరవాసులు ట్రెక్కింగ్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. అలాంటి ట్రెక్కింగ్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసేలా కనువిందు చేస్తోన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రకృతి అందాలు చూసొద్దాం రండి.

ఆహ్లాదకరమైన వాతావరణం..
ఏటా ఈ సీజన్ వచ్చిందంటే చాలు విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కొత్తరూపు సంతరించుకుంటుంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ట్రెక్కింగ్ ప్రియులను రా.. రమ్మంటూ.. ఆహ్వానిస్తోంది. సుమారు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం ట్రెక్కింగ్కు అనువైనదిగా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. మానసిక ప్రశాంతతతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు ఆసక్తి కనపరుస్తోన్న నగరవాసులకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. గుబురుగా పెరిగిన ముళ్లపొదల గుండా సాగే నడక దారిలో ప్రయాణం కాస్త కటువుగా అనిపించినా ఆహ్లాదాన్ని చేరువచేస్తుంది. పాయలుగా ప్రవహించే చిన్న చిన్న సెలయేళ్ల నుంచి వచ్చే నీరు ఎంతో స్వచ్ఛగా కనిపిస్తుంది.

డిజిటల్ ప్రపంచానికి దూరంగా..
ఇటీవల కాలంలో విజయవాడ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక ట్రెక్కింగ్ ప్రియుల కోసం YHAI అనే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఔత్సాహికులను బృందాలుగా కొండపల్లి అటవీ ప్రాంతంలోని ట్రెక్కింగ్ పాయింట్ల దగ్గరకు చేరుస్తోంది. సందర్శకుల వయసు, వారి ఆరోగ్య పరిస్థితులను బట్టీ ట్రెక్కింగ్ మార్గాలను నిర్ణయిస్తున్నారు నిర్వాహకులు. డిజిటల్ ప్రపంచానికి అలవాటు పడిపోతున్న పిల్లలకు ఇలాంటి ప్రకృతి ప్రయాణం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని చెబుతున్నారు. అలాగే, పని ఒత్తిడితో సతమతమయ్యే పెద్దలు ఇలాంటి ట్రెక్కింగ్ వల్ల ప్రశాంతతతోపాటు ఆరోగ్యాన్ని పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందుకే కాబోలు.. ఇక్కడి దట్టమైన అడవులు, మంత్రముగ్ధులను చేసే జలపాతాలు, అరుదైన జంతు, వృక్షజాతులు యాంత్రిక జీవితం నుంచి మరో లోకానికి తీసుకెళతాయి భావిస్తున్నారు ట్రెక్కింగ్ ప్రియులు. ఈ అటవీ ప్రాంతానికి విహారయాత్ర ప్లాన్ చేసుకునేవారు ఆహారంతోపాటు మెడికల్ కిట్ను తప్పకుండా తమ వెంట తీసుకువెళ్లాలి. మరెందుకు ఆలస్యం పని ఒత్తిడిని వదిలేసి ప్రకృతితో మమేకమయ్యేందుకు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి!



Click it and Unblock the Notifications












