జీఐఎస్కు ముస్తాబయిన విశాఖ నగర అందాలను చూసేద్దామా?!
విశాఖ నగరం మరింత అందంగా ముస్తాబయ్యింది. నగరంలో రెండు రోజులపాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)కు అనుగుణంగా నగరాన్ని సిద్ధం చేశారు. దేశ విదేవీ పారిశ్రామిక దిగ్గజాలు రానుండడంతో వారిని మందింత ఆకర్షించేలా అధునాత టెక్నాలజీని వినియోగించి పర్యాటక ఆసక్తిని కలిగించేలా నగరాన్ని ముస్తాబుచేశారు. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి!

విశాఖ నగరం అంటేనే పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా చెబుతారు. అలాంటి నగరాన్ని మరింత అందంగా ముస్తాబు చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఎప్పుడెప్పుడు సిటీ అందాలను చూసేద్దామా అన్నట్లు ఉంటుంది కదూ. నగరంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు సిటీ ముస్తాబయ్యింది. బీచ్రోడ్లో ఉన్న రహదారుల రూపురేఖలు మార్చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న వివిధ బొమ్మలకు ఆకర్షణీయమైన రంగులు వేసి.. మరింత అందంగా తయారు చేశారు. చూసేవారి మనసును ఆకట్టకునేలా రూపొందించారు.
కొత్తగా సాగర్నగర్లో మరో బీచ్ను పర్యాటకులు సందర్శించే విధంగా తయారు చేశారు. ఫుట్పాత్లన్నింటికీ రంగులు వేస్తున్నారు. కైలాసగిరిని, వీఎంఆర్డీఏ పార్కు, తొట్లకొండ తదితర ప్రాంతాలకు అతిథులు వెళ్లనున్నందున. ఆయా ప్రాంతాల్లో కొత్త హంగులు సమకూరుస్తున్నారు. తీర ప్రాంత అందాలను చూసి ఆనందించాలి అనుకునేవారికి ఈ అదనపు హంగులు మరింత ఆహ్లాదాన్ని పంచుతాయనడంలో సందేహమే లేదు.

మెళికలు తిరిగిన మొక్కలు..
నగరంలోని కొన్న రోడ్లను మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు. వివిద ఆకృతుల్లో మొక్కలను పేర్చారు. అరుదైన జాతులకు చెందిన మొక్కలను కూడళ్ల వద్ద, అతిథులు బసచసే రహదారుల పక్కన ఉంచడంతో ఇవి చూపరుల మనసు దోచేస్తున్నాయి. మొక్కలతో రూపొందించిన వంపులు తిరిగే డిజైన్లు చూసేవారి కళ్లను నమ్మలేని విధంగా ఏర్పాటు చేశారు. వాటి అందాల గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.

ఇక్కడి చుట్టుపక్కల ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలు సైతం చూపరులను ఎంతో ఆకట్టకునేలా దర్శనమిస్తుననాయి. పచ్చదనంతో కమ్మేసిన రహదారుల సుందర దృశ్యాలు నగర ప్రజలను కనువిందు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన డ్రోన్ షూట్ పర్యాటక ఆసక్తి ఉన్న వారిని మరింతగా ఆకర్షిస్తోంది.
అనేక వర్ణాల అలంకరణలు..
అతిథులు విందు చేసే చోట వివిధ రకాల కూరగాయలను ఆకర్షణీయ పుష్పాల్లా.. పక్షుల్లా అలంకరించారు. దీంతో అక్కడి ప్రంగణాలు అనేక రంగు రంగుల వర్ణాలతో చూడముచ్చటగా దర్శనమిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన డిజైనర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలంటే ఆ మాత్రం తప్పదు కదా అంటున్నారు నగరవాసులు. రహదారులు, పర్యాటక ప్రాంతాలు, సాగరతీరాలు అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. గోడలలపై అపురూప చిత్రాలు, డివైడర్లకు రంగులు వేస్తున్నారు.

విశాఖ మహా నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే, ఔత్సాహికులు ఈ రెండు రోజులూ నగరాన్ని సందర్శించడం కష్టమే. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆక్షలు అమలులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వాహనదారులు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుతం విశాఖ నగరం కట్టుదిట్టమైన భద్రతతో ఉంది. అంచేత అవకాశం ఉన్నంతవరకూ దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications












