వింటర్ సీజన్ ప్రారంభమయ్యింది. ఈ సమయంలో చాలామంది ఇంటిపట్టునే ఉండాలనుకుంటారు. మరికొందరేమో ఈ సీజన్లో అత్యంత శీతల ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారు. అటువంటి వారికోసం విశాఖపట్నం ఎప్పడూ సాదర ఆహ్వనం పలుకుతోంది. శీతాకాలం సందర్శనకు ఇక్కడ ఎన్నో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. గరం గరం ఛాయ్తో పాటు, వేడి వేడి బజ్జీలను ఆస్వాదిస్తూ ఇక్కడి మంచుతో కప్పబడిన ప్రకృతి అందాలను వీక్షించేందుకు తప్పక రావాల్సిందే.. వైజాగ్ సమీపంలో అత్యంత శీతల ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రండి అవెంటో ఓసారి చూసేద్దాం.

వంజంగి
తూర్పు కనుమల మధ్య నెలకొని ఉన్న విశాఖపట్నం సమీపంలోని వంజంగి గ్రామం రమణీయ అందాలతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. వంజంగిలో తెల్లవారుజామున కొండల మధ్య దట్టమైన మేఘాలు అనంతంగా తేలియాడే దృశ్యాలు ఇక్కడికి వచ్చే సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్లోని పాడేరు గిరిజన ప్రాంతానికి సమీపంలో ఉంది ఈ వంజంగి. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఈ వంజంగి పై నుంచి సూర్యోదయ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్, ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు వస్తుంటారు. ప్రకృతి ప్రేమికులకు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైనది.

అరకు
అరకు పేరు వినగానే మన కళ్ల ముందు ప్రకృతి అందాల దృశ్యాలు కనిపిస్తాయి. అరకులోయకు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ ఓ అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరుంది. అరకు లోయ విశాఖపట్నం జిల్లాలో ఉంది. అరకు లోయ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం దాదాపు ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. దాదాపు 36 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ అరకు అందాలను తప్పకుండా వీక్షించాల్సిందే. వైజాగ్ నుండి అరకును చేరుకోవాలంటే కనీసం మూడు గంటల ప్రయాణం చేయాల్సిందే. ఈ సుందరమైన ఘాట్ రోడ్డు గుండా ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

లంబసింగి
ఆంధ్రప్రదేశ్లోని స్విట్జర్లాండ్గా ఈ ప్రాంతాన్నిపిలుస్తారు. వైజాగ్లో అతి ఎక్కువ మంది సందర్శించే ప్రదేశాలలో ఈ ప్రాంతం ఒకటి. ఇక శీతాకాలంలో అయితే ఈ ప్రాంతపు అందాలను చూడాల్సిందే. వైజాగ్ నుండి మూడు గంటల ప్రయాణం చేస్తే ఈ అందమైన అద్భుత దృశ్యాలు కలిగిన ప్రాంతాన్ని చూడొచ్చు. నవంబర్ నుండి జనవరి (శిఖరం శీతాకాలం) మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. ఉదయం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. లంబసింగికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన జలపాతాలు ఉన్నాయి.
పాడేరు
అల్లూరి సీతామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఈ ప్రదేశంలోని మంచు తెరల అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటాయి. ఈ ప్రాంతంమంతా దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంటుంది. తెల్లవారుజామున ఇక్కడి ప్రకృతి అందాలను చూసితీరాల్సిందే.
టైడా
టైడా విశాఖపట్నానికి సమీపంలో తూర్పుకనుమల్లో దట్టమైన అడవుల్లో ఉన్న ఓ చిన్న కుగ్రామం. ఇది విశాఖ నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం అనేక వృక్ష, జంతు జాతులకు నిలయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా జంగిల్ బెల్స్ నేచర్ క్యాంప్ పేరుతో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం రిసార్ట్, లాగ్ హట్లకు ప్రసిద్ధి చెందింది. టైడాలో సూర్యోదయం దృశ్యాలు చూడదగినవి.



Click it and Unblock the Notifications












