ఎటుచూసినా దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. సుమారు 40 అడుగుల ఎత్తున్న అలుగుపై నుంచి జాలువారే నీటిధారల అందాలను మాటల్లో వర్ణించడంలేం. అరుదైన పక్షుల కిలకిలారావాలు.. వినసొంపైన పిల్లగాలి హొయలు చూడాలంటే సిర్నాపల్లి జలపాతం వద్ద అడుగుపెట్టాల్సిందే. ప్రకృతి రమణీయతకు కేంద్రంలా తారసపడే ఈ దృశ్యాలు సిర్నాపల్లి జలపాతం సొంతం.
ఇటీవల తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా రూపాంతం చెందింది. కుటుంబసమేతంగా ఇక్కడకు చేరుకుని జలపాతపు నీటిలో సందడి చేస్తున్నారు. నిత్యం ఉండే పనిఒత్తిడిని మరిచిపోడానికి ఇక్కడ గడిపే ప్రతి క్షణం ఓ ఔషదంలా పనిచేస్తుంది. మరెందుకు ఆలస్యం.. సిర్నాపల్లి ప్రకృతి అందాలను పలకరిద్దాం రండి!
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం వర్షాకాలం వచ్చిందంటే పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న సిర్నాపల్లి జలపాతపు జలపరవళ్లు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం వీకెండ్ స్పాట్గా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోన్న ఈ ప్రాంతపు అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. నిజానికి, పర్యాటకులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ఈ ప్రాంతంలో జలపాతం లేదు. ఇది సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు నుంచి పారుతున్న అలుగు. ఆ నీటి ప్రవాహం జలపాతాన్ని తలపించడంతో వీకెండ్ ఎంజాయ్మెంట్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
40 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపరవళ్లకుతోడు చుట్టూ ఉన్న పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు.. పంటపొలాల్లోని పైరగాలులు ఆదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, ఇక్కడ వసతుల విషయంలో మాత్రం చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేస్తే మాత్రం.. బెస్ట్ పిక్నిక్ స్పాట్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీకెండ్లో ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులు ఈ జలపాతపు సహజ అందాలను మనసారా ఆస్వాదిస్తూ మరిచిపోలేని మధురస్మృతులను మూటగట్టుకెళుతున్నారనడం అతిసయోక్తికాదు.

అలుగు నుంచి జాలువారే నీరే..
ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇది తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన సిర్నాపల్లి సంస్థానంలో గురించి ఎంత చెప్పినా తక్కువే. రాణి జానకీబాయి పాలనలో నిర్మించిన చెరువులు, కోటలు ఇప్పటికీ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడ ఇటీవల పర్యాటకంగా వెలుగులోకి వచ్చిన జానకీబాయి చెరువు అలుగు నుంచి పడుతున్న జలపరవళ్లలో సందడి చేసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవీ ప్రాంతం ఉంది.

ఇక్కడి నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లోని ఆరు చెరువులను నింపడానికి సుమారు రెండు వందల ఏళ్లకు పూర్వం రాణి జానకీబాయి ఈ చెరువు తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ చెరువు అలుగు 100 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో రాతితో పటిష్టంగా రూపొందించారు. అలా చెరువు నిండిన తర్వాత అలుగుపైనుంచి జలపాతాన్ని తలపించేలా ఆ నీరు కిందకు జాలువారుతుంది. వర్షాకాలం వచ్చిందంటే సందర్శకుల వాహనాలతో ఈ రహదారి సందడిగా కనిపిస్తుంది. కుటుంబసమేతంగా వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు మీరూ మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి!



Click it and Unblock the Notifications













