శ్రీశైలంలోని మల్లిఖార్జునుడుని దర్శించుకుందామా..!
దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, అందమైన లోయలు, గలగల పారే సహజ జలధారలు ఈ ప్రాంతం సొంతం. ఎన్నో చారిత్రక విశేషాలు, ఆలయ కళావైభవానికి ప్రతీకగా ఈ ప్రాంతాన్ని చెప్పొచ్చు. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం పట్టణం పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది.
శ్రీశైలం పర్యటనకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ శ్రీశైలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీశైలం వెళ్లాలనుకునేవారు మల్లన్న దర్శనంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల సందర్శన కూడా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మరెందుకాలస్యం శ్రీశైలంలోని మల్లిఖార్జునిడిని ఓసారి దర్శించుకుందామా..

మల్లిఖార్జున ఆలయం
నల్లమల కొండలపై ఉన్న శ్రీశైల మల్లిఖార్జున ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం. ఇది శివునికి అంకితం చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోని శైవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడుతుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు కూడా మల్లిఖార్జునుడి సన్నిధికి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. కార్తీక మాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మహా శివరాత్రినాడు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఎక్కడేక్కడి నుంచో తరల వస్తుంటారు.
సోమనాథ ఆలయం లాగానే మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైనది, అత్యంత శక్తిమంతమైనది. పురాణాల ప్రకారం శివగణ్ అనే నంది శ్రీశైలంలో తపస్సు చేసింది. ఆ తప్పస్సును మెచ్చిన శివుడు, పార్వతి ఆ నంది దగ్గరే కూర్చున్నారు. వారికి ఆ నంది పూజలు చేసింది. అలా మల్లికార్జున స్వామి శివలింగం, పార్వతీదేవి శక్తిపీఠం అవతరించాయి. శ్రీరాముడు కూడా ఈ మహా క్షేత్రాన్ని దర్శించినట్లు చెబుతున్నారు. సంతానభాగ్యం కలగాలని కోరుకునేవారు, పెళ్లి కావాలనుకునేవారు ఎంతో మంది శ్రీశైలానికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఇక్కడి మరొక విశేషత ఏమిటంటే..జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు ఒకే దగ్గర ఉంటాయి.

వీర శిరోమండపం
శ్రీశైల ప్రధానాలయంలో స్వామి వారి ఆలయం ఎదురుగా గల వీరశిరోమండపం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత వుంది. ఈ మండపాన్ని క్రీ.శ.1377లో రెడ్డి రాజులు నిర్మించారు. ఈ మండపంలో భక్తులు వీరావేశంతో తమ తలలను, కాళ్ళు చేతులను, నాలుకలను, కుత్తుకలను గండ కత్తెరలతో నరుక్కునేవారని, ఈ మండప నిర్మాణ సందర్భంగా వేయించిన శిలాశాసనం చెబుతోంది. ఈ సాహస కృత్యాలకే 'వీరాచారం' అని పేరు.
ఎలా చేరుకోవాలి
ఈ ఆలయం ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. రోజంతా అనేక పూజలు, వేడుకలు నిర్వహిస్తారు. వారాంతాల్లో మరియు పండుగల సమయంలో దేవాలయం రద్దీగా ఉంటుంది. దానికి అనుగుణంగా సందర్శనను ప్లాన్ చేసుకోవడం మంచిది. సమీప విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది శ్రీశైలం నుండి 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి, శ్రీశైలం చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, విజయవాడ నుంచి కూడా అన్ని వేళలా బస్సు సౌకర్యం కలదు.



Click it and Unblock the Notifications













