వందేళ్ల చరిత్ర కలిగిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిద్దామా..!
భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటాడు. ఈ ఆశ్రమాన్నిగాంధీజి స్వాతంత్య్రోద్యమ సమయంలో నిర్మించారు. దీనినే గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పిలుస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. గాంధీజీ తన భార్య కస్తూర్బాతో పాటు ఇక్కడ పన్నెండేళ్లు నివాసమున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఆశ్రమం ఓ ప్రముఖ పాత్ర పోషించిందనే విషయం అందరికి తెలిసిందే. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆశ్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే, మరెందుకాలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి..

ఆశ్రమం గురించి..
ఈ ఆశ్రమం జైలుకు, శ్మశానానికి మధ్యలో ఉంది. ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర వంటివి ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి. అయితే గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ చేపట్టాలనుకోవడంతో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం 1917 జూన్ 17న సబర్మతీ నది ఒడ్డున ముప్పయి ఆరు ఎకరాల సువిశాల స్థలానికి ఈ ఆశ్రమాన్ని తరలించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగినది ఈ ఆశ్రమం. గాంధీజీకి స్వాతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించడానికి ఈ ఆశ్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎంతోమంది మేధావులు, నేతలు, విశ్లేషకులు నిత్యం స్వతంత్ర్య సంగ్రామం గురించి ఇక్కడ చర్చించుకునే వారు.
ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ప్రభుత్వం గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో ఈ మ్యూజియంని ఆశ్రమంలో గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశారు. ఆ మ్యూజియాన్ని 1963 మే 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు.

ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు వంటివాటిని పొందుపరిచారు. మ్యూజియంలో మూడు ముఖ్యమైన గ్యాలరీలు ఉన్నాయి. అహ్మదాబాద్ గ్యాలరీ, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ గ్యాలరీ, పెయింటింగ్ గ్యాలరీ వంటివి ఉన్నాయి. ఇక్కడి ప్రతి గ్యాలరీ గాంధీ జీవితంలోని ప్రతి ఘట్టాన్ని పర్యాటకులకు వర్ణిస్తుంది. ఈ మ్యూజియం లోపల లైబ్రరీ కూడా ఉంది. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకుల కోసం ఈ ఆశ్రమాన్ని తెరిచి ఉంచుతారు.
ఎలా వెళ్లాలి?
ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు వివిధ ప్రజా రవాణా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. రిక్షాలు, ఆటోల సాయంతో కూడా ఇక్కడికి వెళ్లొచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే కల్పూరు రైల్వేస్టేషన్ పాల్డి సమీపంలోని గీతామందిర్ వద్ద ప్రధాన బస్ స్టాప్లు ఉన్నాయి. ఇక్కడి నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి.
రైలుమార్గం ద్వారా అయితే ప్రముఖ రైల్వే స్టేషన్ కలుపూర్ ప్రాంతంలో ఉంది. పశ్చిమం వైపు నుండి ప్రయాణిస్తే గాంధీగ్రామ్ స్టేషన్ ఆశ్రమానికి సమీపంలో ఉంది. విమాన మార్గం ద్వారా అయితే, అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి అనేక దేశీయ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications












