తిరుపతిలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాల్సిందే..
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, దూరాభారాల నుంచి భక్తులు తిరుమలేశుని దర్శనానికి వస్తుంటారు.
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల క్షేత్రం లక్షలాది భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఏడాది పొడవునా భక్తుల తాకిడితో, నిత్య పూజలతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అయితే, మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూసేద్దాం పదండి.
వరాహస్వామి ఆలయం
శ్రీ వరాహస్వామి ఆలయం తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదనిగా భావిస్తారు. అందువల్లనే వేంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి కెక్కింది. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్రా ఫలం దక్కదని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారు.

గోవిందరాజస్వామి ఆలయం
తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు వచ్చింది. గోవిందరాజస్వామి వారు శ్రీవారి సోదరునిగా చెబుతారు. స్వామి వారి వివాహానికి కుబేరుడు ధన సహాయం చేసినట్టు ఈ స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం పురాతనమైనది. రామాయణ, భాగవత గాథల శిల్పాలతో ఈ గోపురం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులను, పర్యాటకులను ఈ శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడి మరొక విశేషత గోవిందరాజస్వామి విగ్రహం. ఈ విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది.

పద్మావతి అమ్మవారి దేవాలయం
తిరుపతిలోని పరమ పవిత్రమైన దేవాలయాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం ఒకటి. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. అందుకనే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. తిరుపతి యాత్రకు వెళ్లిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి.. లేదంటే ఆ యాత్రకు ఫలం లభించదని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. శ్రీవారి ఆలయంలో జరిగిన విధంగానే ప్రతి రోజు అలిమేలు అమ్మకు పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం అష్టదళ పదపద్మారాధన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణమాసంలోను, మరికొన్ని దినాలలోను లక్ష్మీపూజ నిత్యం జరుగుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications













