అస్సాం భారతదేశంలోని చాలా అందమైన రాష్ట్రం. ఈ ప్రదేశంలోని తేయాకు తోటలు, బిహు పండుగ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సీజన్లో కుటుంబంతో కలిసి ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం అస్సాం దానికి చాలా మంచి ఎంపిక. ఇక్కడి ప్రకృతి అందాలు, దృశ్యాలు పర్యాటకుల హృదయాల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి. అస్సాం రాష్ట్రం టీ తోటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం మరియు పచ్చదనం పర్యాటకుల ఎంతగానో ఆకట్టుకుంటుంది. అస్సాం భారతదేశంలోని ప్రధాన రాష్ట్రం, దాని సహజ సౌందర్యం, వన్యప్రాణులు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. అస్సాంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

కామాఖ్య దేవాలయం
గౌహతి నగరం అస్సాంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉన్న కామాఖ్య దేవి ఆలయం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో ఒకటిగా కామాఖ్య ఆలయంలో అమ్మవారు పూజలందుకుంటున్నారు. గతంలో జనన మరణాల నుండి విముక్తి కోరుకునే అనేక మంది స్త్రీ పురుషులు ఈ పురాతన మందిరానికి విచ్చేశావరట. అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర జరుపుకుంటారు. ఈ మేళాలో దేశం నలుమూలల నుండి చాలా మంది పర్యాటకులు పాల్గొంటారు. ఈ మందిరం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయాన్ని యోని దేవాలయం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంది.

కజిరంగా నేషనల్ పార్క్
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ జాతీయ ఉద్యానవనం నాగోన్ మరియు గోలాఘాట్ జిల్లాలలో ఉంది. కాజిరంగా నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జీప్ సఫారీ మరియు ఏనుగు సఫారీ పర్యాటకులకు ప్రసిద్ధి. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల కొమ్ము గల ఖడ్గమృగాలు ఉన్న ఈ పార్కును యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1985 సంవత్సరంలో ప్రకటించారు. అంతేకాకుండా ఇక్కడ పులులను చూసేందుకు కూడా టూరిస్టులు ఆసక్తి కనబరుస్తారు. ఈ ఉద్యానవనంలో దాదాపు 2500 ఖడ్గమృగాలు ఉన్నాయి. ఇక్కడ సఫారీ సమయంలో పర్యాటకులు అనేక అరుదైన అడవి జంతువులను చూడొచ్చు. వాటిలో అడవి పందులు, హాగ్ లు, మొరిగే జింకలు, ఏనుగులు, కోతులు, నీటి గేదెలతో పాటు అనేక ఇతర జంతువులు, పక్షులు కూడా ఉంటాయి.

మజులీ
మజులీని అస్సాం సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు. మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఈ బ్రహ్మపుత్ర నది ద్వీపం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక మఠాలు లేదా ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ అస్సామీ సంస్కృతి, వైష్ణవ మతాన్ని అధ్యయనం చేస్తారు. మొత్తం 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ఇక్కడి ప్రజలంతా ఇప్పటికీ పాతకాలం నాటి ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అక్కడి ఇళ్లన్నీ వెదురు గుడిసెలతో నిండి ఉంటాయి. చేతి వృత్తులు, వ్యవసాయం, చేపలు పట్టడం వంటివే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనధారాలు. మరోవైపు ఈ ప్రాంతమంతా సహజసిద్ధమైన అందాలతో ప్రశాంతంగా ఉండటంతో పర్యాటకులు ఈ ప్రదేశానికి వెళ్లేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.



Click it and Unblock the Notifications












