కృష్ణమ్మ ఒడిలో నాగార్జునసాగర్ - శ్రీశైలం ప్రయాణం
ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతిలో నాగార్జునసాగర్ - శ్రీశైలం ప్రయాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిలరావాలు. నిశ్శబ్ద ప్రకృతిలో ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఎత్తైన పచ్చని కొండల్నీ, నీలి జలాల్లో తన అందాన్ని చూసుకునే నీలాకాశాన్ని, ఆ పచ్చని కొండల్ని తెల్లని మేఘాలని ప్రతిబింబిస్తూ నిశ్చలంగా కదులుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చు. మధ్యలో పచ్చని ద్వీపాలు కనువిందు చేస్తాయి.
కృష్ణానదిలో యాభై నిమిషాల పాటు ప్రయాణించి నాగార్జునకొండ ఎడమవైపునకు చేరుకోవచ్చు. దీన్నే నందికొండ అంటారు. ఏటా ఇక్కడికి చేరుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూసిస్తారు. బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, నందికొండలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆయుర్వేద వైద్యంతో చరిత్ర సృష్టించిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ఈ ప్రాంతంలోనే నాగార్జునసాగర్ నిర్మించారు. ఆనకట్ట కారణంగా ముంపునకు గురైన ప్రాంతంలో దొరికిన నాటి నాగార్జుడి వస్తువులను ఈ కొండమీద ఒక మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని చూడటానికి నేపాల్, టిబెట్, థాయ్లాండ్ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

అక్కడి ప్రశాంత వాతావరణం సందర్శకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకువెళ్లే అనుభూతిని అందిస్తుంది. నాగార్జున కొండ ఎడమవైపున కొంత దూరంలో ఏలేశ్వరం గుట్ట ఉంటుంది. నల్లగొండ, నాగర్కర్నూల్, కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఆదివాసీలు, చెంచులు, గిరిజనులు గుట్టపైనున్న శివుడిని ఆరాధిస్తారు. అక్కడి నుండి ఎడమవైపు ప్రయాణిస్తే నాగర్కర్నూల్ జిల్లా వస్తుంది.
జీవవైవిద్య కేంద్రాల్లో నల్లమల ఒకటి
తెలంగాణకు చెందిన టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఆమ్రాబాద్లో ఉంది. దేశంలోని అయిదు జీవవైవిద్య కేంద్రాల్లో నల్లమల ఒకటి. అరుణాచల్ ప్రదేశ్లోని నాందాఫా, పశ్చిమ కనుమల్లోని అగస్త్య మలై, తమిళ నాడులోని నీలగిరి, హిమాలయాలలోని నందా దేవి మిగిలిన కేంద్రాలు. అంతరించి పోతున్న జాతీయ జంతువు పులికి నల్లమలే ఆవాసం. ఇక్కడి నుండి కొంత దూరం వెళ్లాక ఏటవాలుగా ఉండే పగులురాళ్ల గుట్టలు కనువిందు చేస్తాయి. ఇవి సహజంగా ఏర్పడినవి. ఆ రాళ్లగుట్టల్లో కృష్ణానది మీదే ఆధారపడి జీవిస్తున్న చెంచుగూడెంతో పాటు, నాటుపడవలతో చేపలవేట సాగిస్తున్న మత్స్యకారులు ఇక్కడ జీవిస్తారు. వారి జీవన విధానాన్ని దగ్గరగా చూసేందుకు ఈ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుంది.

కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం
కుడివైపు, ఆంధ్ర, ఎడమవైపు తెలంగాణ ప్రాంతంలోని నల్లమల కొండలు.. వాటి మధ్యలో కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో కృష్ణా నది మీదుగా మెల్లగా కిందకి దిగుతున్న సూర్యబింబాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవ్ఞ. రెండు గుట్టల మధ్య పాతాళగంగ వద్ద కట్టిన వారధి కింది నుంచి శ్రీశైలం డ్యామ్ ఎదురుగా ఎడమవైపున ఉన్న లింగాల గుట్ట నుండి ట్యాక్సీలో శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా దేవిని దర్శించుకుని శ్రీశైలం ప్రాజెక్టు చూసి తిరుగుప్రయాణంలో నల్లమల అందాలే గాక దుందుబీ నది సంగమం కనువిందు చేస్తాయి. మరిచిపోలేని అనుభూతులు మిగులుతాయి.



Click it and Unblock the Notifications













