భారత్లోని ప్రకృతి అందాల గురించి మాటల్లో వర్ణించడం కష్టం. మనదేశంలో నగరాలు, గ్రామాలు, పర్వతాలు, గుహలలో ఎన్నో ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక, తమిళనాడులోని ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడి ప్రతి ఒక్క ప్రదేశం ఎంతో సహజంగా ఉంటుంది. ఇక్కడి ప్రతి ప్రాంతం పర్యాటకులకు మరో లోకంలోకి తీసుకెళ్తున్న భావనను కలిగిస్తుంది. ఇక్కడికి వెళ్లే టూరిస్టులకు పచ్చని పొలాలు సాదర ఆహ్వానం పలుకుతుంటాయి. వీటితోపాటు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా పిక్కపాటి సమీపంలో వెలసిన నీలకురింజి పూల గురించి చెప్పుకోవాల్సిందే.

అరుదైన పుష్పం...
ఈ పువ్వులు నీలగిరి జిల్లా పిక్కపాటి సమీపంలో వెలసిన కొండ ప్రాంతాల్లో వికసిస్తాయి. ఇవి కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. ఈ సారి ఈ 'నీలకురింజి' పూలు వికసించడం ప్రారంభించాయి. ఇక, ఈ ప్రాంతంలోని కొండపై సంతరించుకున్న పూల అందాలను ప్రత్యక్షంగా చూసేందుకు పర్యాటకులు తరలివచ్చేస్తున్నారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు చాలా అరుదైన పుష్పమని చెబుతుంటారు. ఈ పూలను ఇప్పడు చూడలేకపోతే ఖచ్చితంగా మరో 12 సంవత్సరాలు వేచి చూడాల్సిందే. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. ఊదా రంగుతో కిలోమీటర్ల మేర కొలది కొండ వాలుపై పూసిన ఈ పూల మొక్కలు ఇక్కడికి వచ్చే సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి అనడం ఆశ్చర్యం లేదు. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి.

240 రకాల కురింజిపూలు..
ఈ నీలకురింజి పూలు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పర్యాటకులకు కనిపిస్తాయి. దీంతో ఈ మూడునెలల కాలంలో అక్కడికి వెళ్లి నీలకురింజి పూలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్థానికులు, టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నీలకురింజి మొక్కలు తమ జీవిత కాలంలో ఒకేసారి మాత్రమే పూలు వికసిస్తాయి. ఇదే దీని ప్రత్యేకత. ఈ మొక్క పుట్టినప్పటి నుంచి పన్నేండేళ్ల తర్వాత మాత్రమే దానికి పూలు వికసిస్తాయి. ఆ పూలు పోయా మొక్క పూర్తిగా ఎండిపోతుంది.
ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మరో కొత్త మొక్క ఎదుగుదల మొదలవుతుంది. అలా మళ్లీ పన్నేండేళ్ల తర్వాత మాత్రమే ఆ మొక్కలకు నీలకురింజిలు పూస్తాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమింటటే.. నీలకురింజి మొక్కల పరపరాగ సంపర్కానికి చాలా కాలం పడుతుంది. అందుకే ఈ పూలు పూసేందుకు 12 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 240 రకాల కురింజిపూల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అందులో 46 జాతులకు చెందిన కురింజి మొక్కలు కేవలం మనదేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

నీలకురింజి అంటే...
నీలకురింజి అంటే మలయాళంలో నీలం రంగు పువ్వు అని అర్థం వస్తోంది. ఇక ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు ద్రవ బంగారంగా పరిగణిస్తారు. ఈ పువ్వుకు అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పూర్వం తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయసును లెక్కించేందుకు ఈ నీలకురింజి పూలను ప్రామాణికంగా ఉపయోగించేవారని తెలుస్తోంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోనే మాత్రమే కాకుండా కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో కూడా నీలకురింజి పూల మొక్కలు వికసిస్తాయి. చివరిసారిగా అక్కడ 2018లో ఈ పూలు పూసాయి. ఇక, ఈ ఏడాది కల్లిపారా కొండల్లో 10 ఎకరాల ప్రాంతంలో నీలకురింజి పువ్వులు వికసించాయి.



Click it and Unblock the Notifications














