ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పురాతనమైన కోటలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందులో ముఖ్యంగా రాయలసీమ రాజసం ఉట్టిపడే కోట... కర్నూలులోని కొండారెడ్డి బురుజు. ఇది అతిపురాతనమైనది. కర్నూలు సందర్శించిన వారు తప్పకుండా ఈ కోటను సందర్శిస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కోట ఇది. అప్పట్లో రాజులు నిర్మించుకున్న కోటగా ఇది ప్రసిద్ధిచెందింది. ప్రస్తుతం ఇది ఒక టూరిస్ట్ కేంద్రంగా పేరుగాంచింది.
అప్పట్లో కర్నూలు జిల్లాను కందనవోలుగా పిలిచేవారు. 1529-49 మధ్య శ్రీకృష్ణదేవరాయలు కర్నూలులోని కొండారెడ్ది బురుజును విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. కర్నూలుకు సమీపంలోని జగన్నాథ గట్టు నుండి తెచ్చిన రాళ్లతో దీనిని నిర్మించారని ఇక్కడివారు చెబుతుంటారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ళు ఈ కోట బురుజులో మనకు కనిపిస్తుంటాయి.
ఈ కొండారెడ్డి బురుజు మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. క్రింది భాగంలో తూర్పువైపు కాపలాదారు ఉండటానికి ఒక చిన్న గదిని ఏర్పాటు చేశారు. ఇక, ఆగ్నేయంవైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉంటాయి. మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉంటాయి. ఈ స్థంబాలను నవాబుల కాలంలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొండారెడ్డి బురుజు లో ప్రస్తుతం ఎత్తైన స్తంభము ఒకటి ఉంటుంది. అదే కర్నూలు నగరానికి తలమానికంగా ఉంది. ఈ బురుజు నుండి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో గల గద్వాల కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం కలదు. తుంగభద్రా నది కింద నుంచి ఈ సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని వాడేవారని స్థానికులు చెబుతున్నారు. 1901 లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ సొరంగాన్ని మూసేసింది.
ఇప్పటికి ఈ సొరంగ మార్గం ఉంది. ప్రస్తుతం కొండారెడ్డి బురుజు ఇప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఇప్పటికే కొండారెడ్డి బురుజు సందర్శించేందుకు సమయ వేళలు కూడా పొడిగించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ షో పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా సుమారు 2 కోట్ల రూపాయలతో లేజర్ లైటింగ్ షోను ఏర్పాటు చేయడం జరిగింది.

సైనికుల కోసం ప్రత్యేక గదులు...
ఈ బురుజు పడమరవైపు అప్పట్లో సైనికుల కోసం ప్రత్యేకంగా ఏడు గదులను నిర్మించడం జరిగింది. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంద్రాలు సైనికులు తమని తాము రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి ద్వారా కోటలోకి వచ్చిన శత్రువులపై దాడి కూడా చేయొచ్చు. ఇక, మూడవ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన ఏడు సైనిక గదులు ఉన్నాయి. ఆ గదుల ముందు విశాలమైన ప్రాంగణం కూడా ఉంది. ఈ ప్రాంగణం మధ్యలోనే 168 ఎత్తు గల పొడవైన స్తూపం ఒకటి ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరవేయటం కోసం నిర్మించినట్లు స్థూపమని తెలుస్తోంది.
చేరుకోవడం ఎలా...
విమాన మార్గం ద్వారా అయితే, కర్నూలుకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సుమారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మార్గం ద్వారా అయితే, కర్నూలులో రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, బెంగళూరు,చెన్నై,తిరుపతి, గుంటూరు తదితర నగరాల నుండి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి. రోడ్డు మార్గం ద్వారా అయితే, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, తిరుపతి, చెన్నై, వైజాగ్ మొదలైన ప్రాంతాల నుండి నిత్యం ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు కర్నూలు నగరానికి అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications













