త్వరలో కనువిందు చేయబోతోన్న నిజామాబాద్ పర్యాటకం
ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలను తలపించే రీతిలో తెలంగాణలోని నిజామాబాద్ పల్లె వాతావరణం పలకరిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు, ఆలయాలు, పక్షులు, వన్యప్రాణులను చూసినవారెవ్వరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అయితే, ఈ జిల్లాలో ప్రస్తుతం అలీసాగర్, అశోక్నగర్ ప్రదేశాలే పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడి గోదావరి తీరం పర్యాటక ప్రాంతంగా త్వరలోనే అందుబాటులోకి రానుండడంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారనుంది. అటవీశాఖ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తుండడంతో ప్రకృతి ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
నిజామాబాద్ జిల్లాలో మరిన్ని పర్యాటక కేంద్రాలు కనువిందు చేయబోతున్నాయి. అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. ఏడాదిన్నర కాలంగా చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. ఇప్పటికే అధికారులు గోదావరి పరిసరాల్లో ఎక్కడెక్కడ విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై స్థలాలను పరిశీలించారు. త్వరలోనే జిల్లా సరిహద్దు గోదావరి తీరం పర్యాటక ప్రాంతంగా మారనుంది.

వన్యప్రాణులు సందడి చేసే పచ్చిక బయళ్లు
జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం నుంచి బాసర పుణ్యక్షేత్రం మీదుగా నవీపేట, నందిపేట్, డొంకేశ్వర్, ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ మండలాలను కలుపుతూ శ్రీరామసాగర్ జలాశయం వరకు గోదావరిలో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ మండలాల్లో వేల ఎకరాల్లో ముంపు భూమి ఉంది. ఒక్క వానాకాలంలో మూడు నెలలు నీరుంటే మిగతా 9 నెలలు మైదానంగా మారుతుంది. ఈ ప్రాంతానికి ఫ్లెమింగో, ఫెలికాన్ వంటి విదేశీ పక్షులు వలస వస్తాయి. ఇక్కడి పచ్చికబయళ్లలో వందలాది నెమళ్లు, కృష్ణజింకలు, దుప్పిలు, అడవి పందులు, తోడేళ్లు సందడి చేస్తాయి. వీటిని చూసేందుకు పరిసర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

తీరం.. పుణ్యక్షేత్రాలకు నెలవు..
ఇక్కడి గోదావరి తీరమంతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవుగా చెప్పొచ్చు. దక్షిణ భారతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో సరస్వతీదేవి కొలువుదీరారు. అతిపురాతన ఉమ్మెడు ఉమామహేశ్వరాలయం, తుంగిని హనుమాన్ మందిరం, పాతకుస్తాపురం సైకత శివలింగం, పోచంపాడ్ రామాలయం వంటి కోవెలలు భక్తులకు కొంగు బంగారంగా ఉన్నాయి. గోదావరికి 25 కిలోమీటర్ల దూరంలో నందిపేట్ కేదారేశ్వరాలయం, అంతే దూరంలో ఆర్మూర్ నవనాథుల సిద్ధుల గుట్ట ఉన్నాయి. ఇలా పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు ప్రకృతి అందాలు వీక్షించేలా చేస్తే ఎకో టూరిజం అభివృద్ధి చెందుతుంది. జలాశయం నుంచి నీరు బయటకు వదలని సమయంలో వెనుక జలాలు నిలకడగా ఉంటాయి. ఈ సమయంలో బోటింగ్కు అనువుగా ఉంటుంది.

అతిథి గృహాలకు ఆహ్వానం..
సందర్శకులు విడిది చేసేందుకు అతిథి గృహాలను అందించనున్నారు. నందిపేట్ మండలంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఉమ్మెడ వద్ద రెస్టారెంటు, నూత్పల్లి, జీజీ నడ్కుడ, గాదేపల్లి పరిసరాల్లో రిసార్టులు, అతిథి గృహాలు నిర్మించేలా ప్రణాళికలు వేశారు. పర్యాటకం కోసం అడవిని, ఈ ప్రాంతంలో ఆవాసం ఉండే జంతువులు, పక్షుల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటే సరిపోతుంది. ఈ గోదావరి తీరప్రాంతపు పర్యాటక హొయలు త్వరలోనే తెలంగాణ ప్రకృతి ప్రేమికులను కనువిందు చేయనున్నాయి.



Click it and Unblock the Notifications













