ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ఆలయంలో ఎన్నో విశేషతలు దాగి ఉన్నాయి. ఈ ఆలయం ఏలూరు జిల్లాలో వెలసింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో శివకేశవులు ఒకేచోట కొలువైన ఉన్నారు. ఇక, వీరి దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అంతేకాదండోయ్, పెళ్లి కానివారు, శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే పెళ్లి సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కుదుటు పడుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరెందుకాలస్యం ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం పదండి.
జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల కేంద్రంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పర్వతశిఖరంపైన కొలువై ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ స్వామివారు నిత్యం పూజలు అందుకుంటుంటారు. ఈ ఆలయంలో నరసింహాస్వామివారు పులిరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాదు, ఇక్కడ శివకేశవులు ఒకే చోట కొలువై ఉంటారు. ఇక, ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడని ఇక్కడివారు చెబుతుంటారు.
స్వామివారు ఇక్కడ యోగముద్రలో దర్శనమిస్తారు. ఆ స్వామి చెవిలో భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటే ఇరవై ఒక్క రోజుల్లోనే వారి కోరికలు నెరవేరతాయనీ ఇక్కడికొచ్చిన భక్తులు చెబుతున్నారు. ఇక, పెళ్లి కానివారు ఇక్కడ శాంతి కల్యాణం జరిపిస్తే వెంటనే వివాహం కుదురుతుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నాలుగువేల ఏళ్ల చరిత్ర..
శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుమారు నాలుగువేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని నూజివీడు జమీందారులు అభివృద్ధి పరిచారని ఇక్కడివారు అంటున్నారు. ఇప్పటికీ వారి వారసులే లక్ష్మినరసింహస్వామి సేవలో తరిస్తున్నారు. ఈ కొండపైన ఒక్క నరసింహ స్వామి మాత్రమే కాకుండా, పరమేశ్వరుడు కొండమల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆయనతోపాటు వరదరాజ స్వామి, గోదాదేవి, వేణుగోపాల స్వామి, రాజరాజేశ్వరస్వాములు కూడా పూజలందుకుంటున్నారు.
ఇక ఈ ఆలయంలోని ప్రాంగణంలోని మెట్ల కోనేరును విష్ణుమూర్తే స్వయంగా తవ్వినట్లుగా చరిత్ర చెబుతోంది. అందుకే దీనికి వరాహ పుష్కరిణి అనే పేరు కూడా పెట్టారట. ఈ ఆలయంలో కార్తికమాసం, శివరాత్రి పర్వదినాలలో కొండపైన దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, రథసప్తమినాడు రథోత్సవం, మాఘమాసంలో స్వామివారి కల్యాణోత్సవం, వైశాఖ మాసంలో నృసింహ జయంతి వేడుకల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక, వాటిని చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో తరలివస్తారు.

అనేక కథలు...
ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. కృతయుగంలో శుభవ్రత అనే మహారాజు మహావిష్ణువు కోసం తపస్సు చేయడంతో ఇక్కడ స్వామి వారు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు ఆ మహారాజు తాను ఈ ప్రదేశంలోనే పర్వత ఆకారంలో కొలువు దీరుతానని, తనపైన లక్ష్మీసమేతంగా కొలువుదీరమంటూ వేడుకున్నాడట. దాంతో స్వామివారు ఇలా ఇక్కడ కొలువుదీరానని చరిత్ర చెబుతుంది.
చేరుకోవడం ఎలా..?
ఈ పుణ్యక్షేత్రం ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల కేంద్రంలో వెలసింది. ఇక్కడ అన్ని రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, ఏలూరు వరకు రైలు ప్రయాణం చేయొచ్చు. ఇక, విజయవాడ నుంచి అనేక బస్సు సర్వీసులు ఆగిరిపల్లికి అందుబాటులో ఉంటాయి. నూజివీడు నుంచి సుమారు 20 కిలోమీటర్లుదూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 44 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఏలూరు నుంచి కూడా బస్సులు, ప్రైవేట్ వాహనాలు, క్యాబ్లు నిత్యం పర్యాటకులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి అయితే, ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












