మరో మూడు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలకు వెళ్లి ఘనంగా పూజ కార్యక్రమాలు చేస్తారు. అంతేకాదు, ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే, దేశంలో ప్రసిద్ధిచెందిన మహాలక్ష్మిదేవీ అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత పేరుగాంచిన ఆలయాలను ఈ దీపావళికి సందర్శించేద్దామా..?
చెన్నై
దేశంలోని ప్రసిద్ధిచెందిన మహాలక్ష్మి దేవాలయాలలో చెన్నైలోని అష్టలక్ష్మి ఆలయం ఒకటి. ఈ ఆలయం తమిళనాడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని నాలుగు అంతస్తులలో నిర్మించారు. ఈ ఆలయంలోని లక్ష్మీదేవి అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. మొత్తం ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో వీక్షించే అద్భుత అవకాశం భక్తులకు లభిస్తుంది. ఈ ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇక్కడికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఇక, పండుగ సమయాల్లో ఇక్కడి రద్దీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీపావళి వేళ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.

తమిళనాడు
మరో ప్రసిద్ధిచెందిన ఆలయం తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్. ఇది రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో వెలసింది. ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని 'గోల్డెన్ టెంపుల్' అని అంటారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయం సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం చెన్నైనుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున వెలసింది. ప్రతి ఏటా ఇక్కడ దీపావళి సందర్బంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతారు.

ముంబై
ముంబైలోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్లో వెలసింది. ఈ ఆలయం ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ప్రసిద్ధిచెందింది. దీనిని బ్రిటీష్ కాలంలోనే నిర్మించినట్లు తెలుస్తోంది. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మించమని కోరినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇండోర్
ఇండోర్లోని మహాలక్ష్మి ఆలయం దేశంలోనే ప్రాముఖ్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్లోని వెలసి ఈ ఆలయానికి భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మహాలక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో వెలసింది. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్రావు (II) నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని మూడు అంతస్తులతో నిర్మించారు. 1933లో ఈ ఆలయం అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. తిరిగి 1942లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు.

కొల్హాపూర్
కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి పాలకుడు చాళుక్య కర్ణదేవుడు ఈ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని షిల్హర్ యాదవ్ 9వ శతాబ్దంలో పునర్నిర్మించాడు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేతక ఏంటటే.. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ఇది సుమారుగా 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం నాటిదని అధికారులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications













