హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో శ్రీకృష్ణుని జన్మదినమైన కృష్ణాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, గోకులాష్టమి వంటి పేర్లతో భక్తులు పిలుస్తుంటారు. శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడి జన్మదినంగా చెబుతారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది ఆగస్టు 26న ఈ పండుగ వచ్చింది. ఈ పండుగ వేళ దేశంలోని కృష్ణుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే, భారత్లో ప్రసిద్ధిచెందిన కృష్ణుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా దేశంలోని ఆయా ఆలయాలు కృష్ణుని పేరుతో మారుమోగుతుంటాయి. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రసిద్ధిచెందిన శ్రీకృష్ణుని ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం పదండి.

బృందావనం, ఉత్తరప్రదేశ్..
యూపీలోని మధురను శ్రీకృష్ణుని జన్మభూమిగా పిలుస్తుంటారు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించారు. మధురలోని ఆలయ ప్రధాన గర్భగుడిలో కృష్ణుడు, రాధ, బలరాముని చిన్న విగ్రహాలతో పాటు పాలరాతి కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది.
ఈ ఆలయంలో జన్మాష్టమి, చప్పన్ భోగ్, లతామర్ హోలీ వంటి ప్రధాన పండుగులను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మధురలో గర్భ గుహ, గోకులం, బృందావనం, ఇస్కాన్ వంటివెన్నో. ఇక్కడికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం జన్మాష్టమి, రాధాష్టమి..

ద్వారక, గుజరాత్
దేశంలోని మరో ప్రసిద్ధిచెందిన కృష్ణుని ఆలయం గుజరాత్లోని ద్వారకాలో వెలసింది. దీనిని కృష్ణుడు ఏలిన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇక్కడ సుమారు 2500ఏళ్ల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. దీనిని జగత్ మందిర్ లేదా త్రిలోక్ సుందర్ అని కూడా అంటుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం దేశంలోని నాలుగు ధామ్లలో ద్వారాకని ఒకటిగా పరిగణిస్తుంటారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కబడి ఉంటుంది.
ఈ ఆలయ నిర్మాణం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏటా ఇక్కడ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను గోవిందుడిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంకా ఇక్కడ ప్రసిద్ధిచెందిన ఆలయాలు మరెన్నో ఉన్నాయి. శ్యామల్జీ, గోమతీ ఘాట్, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, జాంబవతీదేవి, సత్యభామాదేవి, రుక్మిణీదేవి, జగన్నాథ్ ఆలయాలు చూడదగినవి.

గురువాయూర్, కేరళ
దేశంలోని మరో ప్రసిద్ధిచెందిన శ్రీకృష్ణుని ఆలయం కేరళలో ఉంది. ఇది గురువాయూర్ వెలసింది. ఇక్కడ ఉన్న ఆలయాన్ని భూలోక వైకుంఠంగా పరిగణిస్తుంటారు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని 'దక్షిణ భారత ద్వారక'గా కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయంలోని విగ్రహాన్ని విష్ణుమూర్తే స్వయంగా సృష్టించారని స్థానికులు చెబుతుంటారు. ఆలయంలోని విగ్రహం విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఇది శ్రీ కృష్ణుని కోవెలగానే ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి.
ఇక్కడ చిన్నారులకు అన్నప్రాసన చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఏనుగుల పందెం కూడా నిర్వహిస్తారు. అయితే, ఈ ఆలయంలోకి ప్రవేశించేందుకు భక్తులకు డ్రెస్ కోడ్ ఉంది. ఇక్కడికి సమీపంలో మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, వెంకటాచలపతి, పార్థసారథి, చాముండేశ్వరి దేవాలయాలు వంటి ప్రసిద్ధిచెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.



Click it and Unblock the Notifications














