ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు బారులు తీరుతుంటారు. ఇక్కడికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈకొండపై వెలసిన స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ స్వామివారి ఆలయం దేశంలోనే ఎంతో పేరుగాంచింది. ఇక్కడికే కేవలం సాధారణ భక్తులు మాత్రమే కాకుండా వీఐపీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సైతం క్యూలు కడుతుంటారు. దేశంలోని అత్యంత సంపదగలిగిన ఆలయం కూడా ఇదే.
ఇక, తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని చాలామంది ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. ముందుగానే ప్రణాళికలు కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ టూర్ ముగుస్తోంది. రండి ఆ ప్యాకేజీ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
శ్రీవారి దర్శనానికి ఫ్టైట్ జర్నీ...
తెలంగాణ టూరిజం తిరుమల భక్తులకు ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. Tirumala Seegra Darshan - From Hyderabad by Flight పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా తెలంగాణ టూరిజం వారి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి https://tourism.telangana.gov.in/FlightBooking వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం భాగ్యం పొందేందుకు ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్లో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు సమీపంలోని ఇతర సందర్శనీయ ప్రాంతాలను కూడా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ లో భాగంగా ఉచితంగా స్వామివారి శ్రీఘ్ర దర్శనం ఉంటుంది.
వన్డే టూర్ షెడ్యూల్..
ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతారు. 9.30 AMకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి హోటల్ కు వెళ్లి ఫ్రెషప్ అయ్యాక, తిరుపతి నుంచి కారులో తిరుమలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటలకు శ్రీవారి దర్శనం పూర్తి అవుతుంది. 2 గంటలకు భోజనం ఉంటుంది. అనంతరం అక్కడికి సమీపంలోని పద్మావతి ఆలయానికి ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం 03. 30గంటలలోపు దర్శనం పూర్తి అవుతుంది. 5.30PM కు తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.6.35 PM గంటలకు తిరుపతి నుంచి ఫ్లైట్ హైదరాబాద్కు బయల్దేరుతుంది.
7.45PM గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో ఈ వన్డే టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. తెలంగాణ టూరిజం ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుంటునే శ్రీవారి శ్రీఘ్ర దర్శన సౌకర్యం కూడా ఈ టూర్ ప్యాకేజీలో అందుబాటులో ఉంటుంది.
ఇక, ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి రూ. 12499గా నిర్ణయించడం జరిగింది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తెలంగాణ టూరిజం వారి అధికారిక వెబ్సైట్ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













