ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునేవారికి ఏపీలోని పాపికొండల పర్యటన ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. ఉప్పొంగిపోయే గోదావరిలో బోటులో పాపికొండల ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ. ఈ ఏడాది జులై నుంచి పాపికొండలు విహారయాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది పర్యాటకులు మళ్లీ పాపికొండలు పర్యటను ఎప్పుడు ప్రారంభవువుతుందా? అని ఎదురుచూశారు. అలాంటివారికి అధికారులు ఓ శుభవార్తను అందించారు. పాపికొండల పర్యటనకు అధికారులు అనుమతినిచ్చారు. గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యటనను తిరిగి ప్రారంభించారు. ఆ వివరాలేంటో చూసేద్దాం..
మాక్ డ్రిల్ నిర్వహణ..
పాపికొండల పర్యటనలు పునః ప్రారంభనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్డీఆర్ఎఫ్ సభ్యులతో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్న పాపికొండల పర్యటనకు అధికారులు బోట్లను తనిఖీ చేసి, మాక్ డ్రిల్ నిర్వహించారు. వీటితోపాటు గోదావరి నదిపై బోటు ఏ విధంగా నడపాలని, అదేవిధంగా గోదావరిలో ప్రమాదం వంటివి జరిగితే.. వారిని ఏ విధంగా కాపాడాలనే అనే అంశంపై ఎస్డీఆర్ఎఫ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంత శనివారం నుండి ఈ పర్యటన ప్రారంభంకానుంది.

గోదావరిలో బోటు ప్రయాణం...
రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులను పాపికొండలు పర్యటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా ఈ పర్యటన ఉంటుంది. ఇక, చాలామంది పాపికొండల మధ్య గోదావరిలో బోటు షికారు చేస్తూ . ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా కూడా ఉంటుంది. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు చాలా రోజుల తర్వాత ఈ పర్యటన పునః ప్రారంభించారు. పాపికొండల టూర్ ఇకనుంచి ప్రతి రోజూ ఉంటుందని ఏపీ టూరిజం శాఖ వెల్లడించింది. అంతేకాదు, పర్యాటకులు పాపికొండల్లో ఒకట్రెండు రోజులు స్టే చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

అతి తక్కువ ధరకే..
రాజమండ్రి నుంచి పాపికొండలు పర్యటన ప్రారంభమవుతుంది. ఈ టూర్ అతి తక్కువ ధరకే పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల పర్యాటకులు ఏపీ టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్ను https://tourism.ap.gov.in/home , https://www.aptourismrajahmundri.com సంప్రదించగలరు. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ట్రిప్లు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ టూర్లో భాగంగా ముందుగా రాజమండ్రి నుంచి గండి పోచమ్మ ఆలయం వరకు వాహనాల్లో తీసుకెళతారు. అక్కడి నుంచి సుమారు 75 కిలోమీటర్ల లాంచీల్లో గోదావరిలో పర్యటన ఉంటుంది. మధ్యాహ్న సమయంలో పాపికొండల వద్దకు చేరుకుంటారు. అక్కడ కాసేపు ఉన్నాక, తిరిగి బోటులో సాయంత్రానికి గండి పోచమ్మ ఆలయానికి వచ్చేస్తారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రికి పాపికొండలకు మధ్యన పోలవరం, పట్టిసీమ వంటి టూరిస్ట్ స్పాట్లు కూడా ఉన్నాయని ఏపీ టూరిజం శాఖ తెలిపింది. పోలవరం నుంచి కూడా పాపికొండలు వెళ్లొచ్చు. రాజమండ్రి నుండి అయితే, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఉంటుంది.
ఇవి తప్పనిసరి...
ఈ పర్యటనలో పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్టు, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. బోటు ప్రయాణంలో తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలి. ఎటువంటి ప్రమాదాలు జరగ్కుండా ముందు జాగత్తగా అన్నీ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. మరెందుకాలస్యం మీరు కూడా పాపికొండలు ప్రయాణానికి బయలుదేరండి మరి..



Click it and Unblock the Notifications












