ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో రామాలయాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో భద్రాచలం వంటి ప్రసిద్దిచెందిన రామాలయం కూడా ఉంది. ఇక, ఆంధ్రాలో కూడా ఒంటిమిట్ట వంటి రాముని దేవాలయాలతో పాటు ఉత్తరాంద్రలోని రామనారాయణం కూడా ఉంది. ఈ ఆలయం ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. ఈ రామాలయం విజయనగరం జిల్లా కేంద్రానికి అయిదు కిలో మీటర్ల దూరంలో నిర్మించిన ఒక అద్భుత పుణ్యక్షేత్రమని చెప్పుకోవాలి.
రామబాణం ఆకారంలోని ఆలయం...
ఈ ఆలయం రామబాణం ఆకారంలో ఉన్న ఒక గొప్ప కట్టడం. ఈ ఆలయం చుట్టూ రామాయణ ఘట్టాలను ఆవిష్కరించారు. ఈ రామాలయం విజయనగరం నుంచి కోరుకొండ వెళ్ళే దారిలో ఉంటుంది. విజయనగరం రైల్వే స్టేషన్ కు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. ఈ పుణ్యక్షేత్రాన్ని NCS ట్రస్ట్ నిర్మించింది. ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు నారాయణం నరసింహ మూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
గరికపాటి నరసింహారావు ,చాగంటి కోటేశ్వర రావు సహా పలువురు ప్రముఖులు మార్చి 22, 2014న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ అద్భుత కట్టడం సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ కట్టడం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది.

రామనారాయణం ఆలయ విశేషాలు..
ఈ ఆలయాన్ని ధనుస్సు ఆకారంలో నిర్మించారు. అంతేకాదు ఈ ఆలయంలో చాలా విశేషాలు దాగి ఉన్నాయి. వాల్మీకి విరచిత రామాయణం లోని ముఖ్య భాగాలను 72 ఘట్టాలుగా విభజించి, వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసారు.
సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామ ఆలయం కూడా ఉంది. ధనుస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ ఆలయపు ధనుస్సు ఆకారం ఎంత విశిష్టమైందో, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఆలయం రెండంతస్తులుగా నిర్మితమైంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద ఫౌంటెన్లను నిర్మించారు. మెట్లకు ముందు ఈ ఆలయ వ్యవస్థాపకులు నారాయణం నరసింహమూర్తి విగ్రహం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఒక పూలతోట కూడా ఉంది.
కింది అంతస్తులో అల్పాహార శాల, అన్న ప్రసాద శాల, గ్రంథాలయం, వేద పాథశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల వంటివి ఉన్నాయి.

3D మ్యాపింగ్ లేజర్ షో ...
ఈ ఆలయ ప్రాంగణంలో వేదపాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 65 మంది పిల్లలు అభ్యసిస్తున్నారు. అలాగే ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చే భక్తులు, సందర్శకులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇతర దేవతలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు అనేకం ఉన్నాయి . ఆయా దేవతా మూర్తుల జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి ఆయా రోజుల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు.
రామాయణం ఘట్టాలను తెలిపే ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి పర్యాటకుల కోసం తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఇక్క డ లేజర్ షోను కూడా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామిపై ప్రదర్శించే 3D మ్యాపింగ్ లేజర్ షో చూసేందుకు నిత్యం భారీగా భక్తులు తరలివస్తారు ఇక, శ్రీ రామ నవమి వచ్చిందంటే మాత్రం ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం విపరీతంగా ఉంటుంది. మరెందుకాలస్యం మరీ మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ ఆలయాన్ని సందర్శించేయండి..



Click it and Unblock the Notifications












