రొట్టెల పండగ .. మొహర్రం మాసంలో నిర్వహించే వేడుక. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ రొట్టెల పండగ నిర్వహిస్తుంది. ఈ పండగను ప్రతి ఏటా మొహర్రం మాసంలోనే నిర్వహిస్తారు.
ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !
నెల్లూరులోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధిగాంచినది. పేరుకు దర్గానే అయినప్పటికీ ఇక్కడికి హిందువులు, క్రిస్టియన్లు వస్తుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రంతో నూతన ఏడాది మొదలవుతుంది. మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11 వ రోజు నుండి నాలుగు రోజుల పాటు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !
12 మంది వీరులు
దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే క్రీ.శ.1751 లో సమాజ శ్రేయస్సు కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది.
చిత్రకృప : Sumanthaks
యుద్దం
ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన తరఖ్మాన్ల్ దేశంలో పర్యటిస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద ఇస్లామేతరులకు, తరఖ్మాన్లకు యుద్దం జరిగింది.
చిత్రకృప : Palagiri
దర్గామిట్ట
ఈ యుద్దంలో తరఖ్మాన్లు ప్రాణ త్యాగం చేశారు. అలా ప్రాణ త్యాగం చేసిన వారిలో 12 మంది (బారాషహీద్లు) మొండాలను గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి. ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు.
చిత్రకృప : Shajeer Shaik
భక్తులు
భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. ఏడాది 15 లక్షల మంది హాజరవ్వొచ్చని అంచనా.
చిత్రకృప : Palagiri
రజకులు
ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. అలా ఒకరోజున రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే త్వరగా కోలుకుంటుందని చెప్పారు.
చిత్రకృప : Adam sk~commonswiki
మట్టి
ఉదయాన్నే భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా "ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతున్నది, ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తాము" అని దండోరా వేయిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్ధానంలో వున్న వారికి వివరిస్తారు.
దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది.
దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్ధనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు.
చిత్రకృప : Basha Shaik
రొట్టెలు మార్పు చేసుకోవడం
అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితి ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తున్నది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలోఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండంతో ఈ పండుగ 4 రోజులుగా జరుపుకుంటున్నారు.
చిత్రకృప : Palagiri
కోర్కెల కోసం మొక్కులు
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
చిత్రకృప : Nellore City
మూడు రోజుల పాటు
మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
చిత్రకృప : Mahesh Kadiri
కృతజ్ఞత
ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు.
చిత్రకృప : Mahesh Kadiri
రొట్టెలు
ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.
చిత్రకృప : Palagiri
మొక్కు చెల్లిస్తారు
ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,వీసా రొట్టె,అభివృద్ధి రొట్టె,సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు .
చిత్రకృప : Palagiri
స్వర్ణాల చెరువు
వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువు నందు వదిలేస్తారు.
చిత్రకృప : Palagiri
సులభంగా గుర్తించేందుకు
ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.
చిత్రకృప : Palagiri
ఇతర దర్గాలను
మత సామరస్యం కు ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాల ను కూడా సందర్శిస్తారు.
చిత్రకృప : Mahesh Kadiri
బోటు షికారు
చెరువు వద్ద వున్న ఎపి టూరిజం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
చిత్రకృప : vijay chennupati
గంధ మహోత్సవం
రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గా లో గంధ మహోత్సవం జరుగుతుంది.
చిత్రకృప : Basha Shaik
ఎలా వెళ్ళాలి ?
నెల్లూరు జిల్లాకు రాష్ట్రం నలుమూల నుండి బస్సు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి బస్సులు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రేణిగుంట, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాలు చేరువలో ఉన్నాయి.
నెల్లూరు నుండి దర్గా వరకు ప్రవేట్ వాహనాలు, ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.
చిత్రకృప : Palagiri