ఏపీలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి సైతం వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అంచేలా ఓ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.100 కోట్లకు పైగా నిధులను వెచ్చించి వంద రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) ప్రాజెక్టులను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
పర్యాటకులను ఆకర్షించే విధంగా నదులు, సువిశాలమైన తీర ప్రాంతాల్లో వినోదభరితమైన సదుపాయాలను కల్పించేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణా నదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ తేలియాడే రెస్టారెంట్లో ఒకేసారి 500 మంది వరకూ పాల్గొనేందుకు వీలుగా డిజైన్ చేయనున్నారు. అనంతరం పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కాకినాడ, దిండి, సూర్యలంక తదితర ప్రాంతాల్లో రానున్న మూడు నెలల్లో ఈ తరహా ఏర్పాట్లతోపాటు వివిధ సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నారు.
విడిది చేసేందుకు కారవాన్లు
రాజమహేంద్రవరంలోనూ గోదావరి నదిపై ఇదే తరహా తేలియాడే రెస్టారెంట్ ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యాటక నగరం విశాఖపట్నం, కాకినాడ, సూర్యలంక తీరప్రాంతాల్లో క్లాంపింగ్, గ్లాంపింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించేలా తీరప్రాంతపు ఒడ్డున ఇసుకలో రిసార్టులును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం విశాఖలోని అరకు, తొట్లకొండ, చిత్తూరులోని హార్సిలీహిల్స్లో కారవాన్ ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ మూడు సందర్శనీయ ప్రదేశాలలో కుటుంబసమేతంగా వచ్చే పర్యాటకులు, మిత్రులు రాత్రిపూట బస చేసేందుకు వీలుగా ఈ కారవాన్లలో అన్ని సదుపాయాలూ ఉండేలా వాటిని రూపొందించనున్నారు. అలాగే రుషికొండలో అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా మూడు స్పీడ్ బోట్లు కేటాయించనున్నారు.
అడ్వెంచర్ పర్యాటకం..
విజయవాడలోనూ బెర్మ్ పార్క్, మూడు స్పీడ్ బోట్లను అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వాటర్ స్పోర్ట్స్లో భాగంలో విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, సూర్యలంక తీరప్రాంతాల్లో ఐదు జెస్కీలు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలో బెర్మ్ పార్కు నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుంచి పోలవరం-భద్రాచలం మధ్య డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను లాంచ్ చేసేందుకు పలు ప్రైవేట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే, కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్ రూం లగ్జరీ హౌస్ బోటు, విజయవాడలో మరో వీఐపీ బోటు ఏర్పాటుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
అలలపై ప్రయాణించే క్రూయిజ్ నౌక..
విజయవాడలో బెర్మ్ పార్కు నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీం, వాటర్ పార్కు, చిత్తూరులోని చంద్రగిరి కోట వద్ద సౌండ్, లైట్ షో వంటి పర్యాటక ఆసక్తి కలిగించే ఏర్పట్లు చేయనున్నారు. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం క్రూయిజ్ నౌకను విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కోల్కతా తీరం మీదుగా ఏర్పాటు చేయనున్నారు. అరకు సందర్శన కోసం వచ్చి, సాహస క్రీడలను ఆకట్టుకునేందుకు ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, రాక్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్, మోటార్ బైక్ టూరింగ్ వంటి క్రీడా ఏర్పట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.



Click it and Unblock the Notifications













