శ్రీముఖ లింగేశ్వరుని ఆలయ సందర్శనకు బయలుదేరండి!
పరవళ్లుతొక్కే వంశధార నదీ తీరాన కొలువై ఉన్న ఈశ్వరుని రూపమే శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం. ప్రదక్షణ మాత్రమున మోక్షాన్ని ప్రసాదించే దేవునిగా శ్రీముఖ లింగేశ్వరుడు ప్రసిద్ది గాంచాడు. శివరాత్రికి ఇక్కడ ఎత్తున జరిగే తిరునాళ్ళ (జాతర) రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.
అదేవిధంగా జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శివరాత్రికి సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఆ శ్రీముఖలింగం పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి!
శ్రీముఖలింగం ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ముఖలింగం అనే గ్రామంలో ఉంది. వంశధార తీరంలో వెలసిన ఈ ఆలయంలో శ్రీ మధుకేశ్వరస్వామి ఆలయం, శ్రీ భీమేశ్వరాలయం, శ్రీ సోమేశ్వరాలయం ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 1500 సంవత్సరాల క్రితం కళింగ గంగా వంశస్తులు నిర్మించారని, రెండవ గంగ వంశం రాజులకు కాలింగ నగరం అన్న పేరుతో ఇక్కడ రాజధాని ఉండేదని ప్రచారంలో ఉంది.
ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని, వైజయంతీ క్షేత్రమని కూడా పిలుస్తుంటారు. ఈ ముఖలింగానికి మొదట గోవిందకాననం అని పిలిచేవారని క్షేత్ర పురాణం చెబుతుంది. నాలుగు యుగాల్లోనూ ఇక్కడ ఉన్న ఈశ్వరుడిని జయంతీశ్వర, గోకర్ణేశ్వర, మదూకేశ్వర, ముఖలింగేశ్వర అనే పేర్లు ఉన్నాయని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుంది.

కనులవిందైన ఆలయం..
ఈ ప్రాచీన శైవ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. ఆలయం చుట్టో పెద్ద ప్రాకారం ఉంటుంది. తూర్పుముఖంగా ఉండే ఆలయంలో చుట్టూ అష్టదిక్పాలకుల లింగాలు ఉంటాయి. ఈ ఆలయ క్షేత్ర పాలకుడు మాధవ స్వామి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నంది విగ్రం చూడముచ్చటగా ఉంటుంది.
ఈ క్షేత్రం పంచ దేవతారాధన క్షేత్రంగా విశిష్టత పొందింది. సూర్యుడు, విష్ణువు, శంకరుడు, పార్వతి, గణపతి ఈ ఆలయంలో పూజలందుకోవడం విశేషం. పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయ ప్రాంగణం ఓ అధ్యాత్మిక చింతనకు నిలయంగా ఉంటుందని ఇక్కడికి వచ్చే సందర్శకులు చెబుతూ ఉంటారు.

అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం
శ్రీ ముఖలింగాలయంలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. ఆలయ సింహద్వారం దగ్గరలోని ఒక శిలాఖండం మీద చిత్రించిన ప్రతిమ కిరాతార్జునీయం కథకు ప్రతిరూపంగా భావించారు. గర్భగుడిలో ఉంటే ఈ ముఖలింగం అన్ని శివలింగాల మాదిరి నల్లగా కాకుండా తెల్లగా ఉంటుంది. వంశధార నదిలో స్నానం చేసి ఈ ముఖలింగానికి ప్రదక్షణలు ఆచరిస్తే మరుజన్మ లేకుండా మోక్షం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా శివరాత్రి మహోత్సవారలు ఘనంగా నిర్వహించనున్నారు. 18, మహాశివరాత్రి జాగారం, 19న పడియా, 20న స్వామివారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో నిర్వహించనున్నారు. అయితే, గతంలో వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఒంటిగంటకు నిర్వహించేవారు. ఈ ఏడాది మధ్యాహ్నం 1.30 గంటలకు అమావాన్య ఉన్నందున పాడ్యమి గడియలు వచ్చిన వెంటనే స్వామి ఉత్సవమూర్తులను వంశధార నదికి తీసుకువెళ్లి, చక్రతీర్థ స్నానాలు 2 గంటల సమయంలో నిర్వహించనున్నారు.

ఎలా వెళ్ళాలి..
అన్ని ప్రధాన పట్టణాల నుంచి శ్రీకాకుళం వరకూ రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి బస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అదేవిధంగా విమానంలో విశాఖపట్నం వరకూ వెళ్లి అక్కడ నుంచి టాక్సీ లేదా బస్సులో శ్రీకాకుళం చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












