విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అదే జగన్మోహినీ అవతారం. విష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తినట్లు శ్రీమహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహినీ అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ.
ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. రాజమండ్రి కి 40 కి. మీ ల దూరంలో, కాకినాడ కు 74 కి. మీ ల దూరంలో, అమలాపురం కు 34 కి.మీ ల దూరంలో వశిష్ట, గౌతమీ అనే గోదావరి ఉప పాయల నడుమ ర్యాలీ గ్రామము కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఎదురెదురుగా ఉండటం.

అమృతం
ర్యాలీ స్థలపురాణం గురించి శ్రీ భాగవత ఇతిహాసంలో పేర్కొనబడింది. అదేమిటంటే క్షీరసాగరమధనం సమయంలో అమృతం ఉద్భవించినపుడు దేవదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తి అమృతం అందిస్తాడు.
చిత్రకృప : Msvamsi

అయ్యప్ప జననం
జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా ... వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పటి ర్యాలీ (ర్యాలీ అంటే పడటం అని అర్థం) అని చెబుతారు.
చిత్రకృప : Adityamadhav83

చోళరాజు
క్రీ.శ. 11 వ శతాబ్దంలో అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేటకై వచ్చి అలసి పోయి ఒక చెట్టుకింద సేద తీరుతాడు. ఆయనకు మహా విష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించాలని చెబుతాడు.
చిత్రకృప : Adityamadhav83

విగ్రహం
వెంటనే రాజు కలలో నుంచి తేరుకొని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. రాజు వెనువెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడు. గుడి ప్రాకారాలు 1936 లో పునః నిర్మించారు.
చిత్రకృప : Adityamadhav83

జగన్మోహనుని రూపం
అమృతం పంచిన తర్వాత మోహినిని శివుడు మోపిస్తాడు. అతని నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంతో వెళ్ళిందట. అలా వేగంగా వెళుతున్నప్పుడు రథం శీల రాలి పడిపోతుందట. అక్కడే విష్ణువు జగన్మోహనునిగా ఉండిపోయాడట.
చిత్రకృప : Adityamadhav83

ప్రత్యేకత
శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం శ్రీమహా విష్ణువు ప్రత్యక్ష రూపం. ఈ విగ్రహం ఏకసాలిగ్రామ శిలతో తయారైంది. ముందువైపు విష్ణువు, వెనకవైపు జగన్మోహిని రూపం కలిగి ఉండటం విగ్రహం ప్రత్యేకత.
చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

విగ్రహ లక్షణాలు
స్వామి పాదపద్మాల మధ్య చిన్న గంగా దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విగ్రహం ముందువైపు విష్ణువు శంఖం, చక్రం, గద మరియు అభయహస్తం కలిగి ఉండి, విగ్రహం పై భాగాన ఆదిశేషుడు పడగవిప్పి నీడనిస్తున్నట్లు ఉండటం విశేషం.
చిత్రకృప : Adityamadhav83

పద్మిని జాతి స్త్రీ లక్షణాలు
విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి వంటివి కలిగి ఉండి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్వామివారికి జరిగే అన్ని పూజలు, హారతులు విగ్రహం వెనుకల కూడా జరుగుతాయి.
చిత్రకృప : Redtigerxyz

పరమేశ్వరుడు
శ్రీ జగన్మోహిని కేశవ స్వామి తూర్పు వైపున ఉండగా ఆయనకు ఎదురూగా పరమేశ్వరుడు పశ్చిమ ముఖం తిరిగి ఉంటాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేయబడినందున పరమేశ్వరుడిని శ్రీ ఉమా కండలేశ్వర స్వామి అని పిలుస్తారు.
చిత్రకృప : Adityamadhav83

ఇతర విగ్రహాలు
దేవాలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబర, రంభ, ఊర్వశి, శ్రీకృష, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాల శిల్పకళాచాతుర్యం ఉట్టిపడుతుంది.
చిత్రకృప : Msvamsi

పండుగలు
జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీ రామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాలస్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు.
చిత్రకృప : Msvamsi

గుడి టైమింగ్స్
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు. గుడిలోపల ఫోటోలు తీయరాదు.
చిత్రకృప : Adityamadhav83

మీ ప్రయాణంలో ఇవి కూడా చేర్చుకోండి
వడపల్లి - శ్రీవెంకటేశ్వర ఆలయం
పంచారామ ఆలయాలు - సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం
చిత్రకృప : Aditya Gopal

వసతి
రావులపాలెం వసతికి మరియు భోజన సదుపాయాలకు సూచించదగినది. రావులపాలెం - ర్యాలీ మధ్య దూరం కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే.
చిత్రకృప : Adityamadhav83

ఇలా చేరండి
ర్యాలీ చేరుకోవటానికి ఎటువంటి టూర్ ప్యాకేజీలు లేవు. కనుక యాత్రికులు రాజమండ్రి విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ లో దిగి ప్రవేట్ బస్సులలో లేదా టాక్సీ లలో ఎక్కి ర్యాలీ చేరుకోవచ్చు.
చిత్రకృప : Adityamadhav83



Click it and Unblock the Notifications












