ప్రపంచంలోనే ఏకైక శ్రీకూర్మనాథ స్వామి ఆలయ విశేషాలు
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు నేటికీ సందర్శకులను ఆకర్షిస్తునే ఉన్నాయి. వాటిలో అరుదైనవిగా చెప్పుకునే కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కోవకు చెందిందే శ్రీకాకుళంలోని శ్రీకూర్మనాథ స్వామి ఆలయం. దీనిని మహావిష్ణువు దశావతారాల్లో రెండోదిగా చెబుతారు. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతం ఒక్కసారిగా ఒక పక్కకు జారిపోతుంటే దాన్ని నిలబెట్టడానికి విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి, పర్వతం బరువును మోసాడని భక్తులు విశ్వసిస్తారు. కూర్మనాథ స్వామి ఆలయ ప్రస్తావన కూర్మా, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో కనబడుతుంది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉంది శ్రీకూర్మనాథ స్వామి ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. నిజానికి శ్రీకూర్మంలో తప్ప కూర్మావతారంలో విష్ణుమూర్తి ఎక్కడ దర్శనం ఇవ్వలేదు. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం. శ్రీ కూర్మ నాథస్వామిని సందర్శించుకోవడం కోసం ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ వంటి పలువురు ప్రముఖులు వచ్చారంటే ఈ ఆలయం యొక్క విశిష్టత అర్థమవుతుంది.

కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు
రాతిమెట్లతో నిర్మితమైన పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన నక్షత్ర తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి. అంతేకాదు, పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెల్లలేని చాలామంది ఇక్కడే పితృ కార్యాలు నిర్వహిస్తుంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని భక్తుల నమ్మకం.
తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు.

ఎక్కడా లేని విధంగా రెండు ధ్వజస్తంభాలు
ఆలయ నిర్మాణ శైలి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో కనువిందు చేస్తుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు సందర్శకుల మనసును దోచేస్తాయి. ఇక్కడ ద్వారాలు, స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తుంది.
అబ్బుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. ప్రధాన విగ్రహం కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి.

ఎలా చేరుకోవాలి ?
శ్రీకాకుళం బస్టాండు నుండి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో చేరుకోవాలనుకునేవారు శ్రీకాకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా శ్రీకూర్మం చేరుకునేందుకు బస్సులు ఉండవు. శ్రీకాకుళం పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర శ్రీకాకుళం చేరుకునేందుకు నిత్యం బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం. విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణం ద్వారా శ్రీకూర్మం చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












