ఆధ్యాత్మిక మార్గంలో హిందువులకు మహా శివరాత్రి ఎంతో ప్రముఖమైన పర్వదినం. ఈ ఏడాది మహా శివరాత్రి పురష్కరించుకుని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ పరమశివుడికి ప్రీతిపాత్రమైన రోజు కోసం శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి 8వ తేదీ మహా శివరాత్రి వస్తుండడంతో ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగేందుకు ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో ప్రత్యేక ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఆ మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతియేటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం ఆనవాయితీగా వస్తోంది.
11 రోజుల పాటు మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పాలకమండలి ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే, బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను ఆలయ అధికారులు వెల్లడించారు. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశనలుమూలలనుంచీ నుంచి పెద్ద ఎత్తున శైవ భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాలినడక మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో పఠిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక అన్ని సత్రాల నిర్వాహకులు కూడా తగినంత మేరకు చెత్తకుండీలు, భద్రతా చర్యల్లో భాగంగా అన్ని సత్రాల నిర్వాహకులు తగినంత స్థాయిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని సత్రాల యాజమాన్యాలు కూడా ముందస్తుగానే నీటి ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసుకుంటున్నారు. అలాగే, దేవస్థానం నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు వేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని దేవస్థానం దృఢ నిశ్చయంతో ఉంది. ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడానికి భక్తులు కూడా సహకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. సత్రాల్లో వసతి పొందే భక్తులకు ఈ విషయమై సత్రాల నిర్వాహకులు కూడా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
షెడ్యూల్ విడుదల
బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజా కార్య్రమాలు, వాహన సేవలు, పట్టువస్త్రాల సమర్పణ, దర్శనం వంటి తదితర అంశాలపై చైర్మన్ పాలక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. అదనపు క్యూలైన్లు, వసతి, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య పనులు తదితర వాటిపై సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను విడుదల చేశారు.

బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
మార్చి 1వ తేదీః ధ్వజారోహణం, శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారుల పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 2: భృంగీ వాహన సేవ
మార్చి 3: హంస వాహన సేవ. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 4: మయూర వాహన సేవ. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 5: రావణ వాహన సేవ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టువస్త్రాల సమర్పణ
మార్చి 6: పుష్ప పల్లకీ సేవ
మార్చి 7: గజ వాహన సేవ
మార్చి 8: మహాశివరాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం.
మార్చి 9: రథోత్సవం, తెప్పోత్సవం
మార్చి 10: ధ్వజావరోహణం
మార్చి 11: అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం



Click it and Unblock the Notifications













