ఉగాది మహోత్సవాలకు ముస్తాబయిన శ్రీశైల క్షేత్రం
తెలుగు రాష్ట్రాలు ఉగాది సంబరాలకు ఇప్పటికే ముస్తాబయ్యాయి. మరీ ప్రత్యేకంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తేందుకు సిద్దమయ్యారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వరకు 5 రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా ప్రారంభించారు. ఉగాది పర్యదినాన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మహా పుణ్యంగా భావిస్తారు భక్తులు.
శ్రీశైల క్షేత్రమునందు అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయడంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభమైనట్లు. స్థానాచార్యులు లోక కళ్యాణం కోసం శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ అఖండ దీపరాదన, కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం, చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశస్థాపన, కంకణపూజ, కంకణధారణ చేశారు.

అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు. ఆ ఆద్భుత దృశ్యాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు ఎంతగానో వేచిచూస్తారు.
మహాలక్ష్మి అవతారంలో
సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. భృంగివాహానాధీశులైన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వలన పనులలో ఏకాగ్రత లభించి, సర్వపాపాలు హరించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

కన్నడిగుల ఇలవేల్పు, ఇంటి ఆడపడుచు శ్రీభ్రమరాంబ అమ్మవారికి మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు నిర్వహించారు. చతుర్బుజాలు కలిగిన ఈదేవి పై రెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తాధులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన శత్రుభాధలు నివారించబడి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం మీదుగా నంది మండపం నుండి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండవగా సాగింది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక చింతనకు ఈ సమయం ఎంతో ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

శ్రీశైల మహాక్షేత్రంలోఉగాది ఉత్సవాల సందర్బంగా భక్తులను అలరించేందుకు కన్నడ భాషలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక, పుష్కరిణి వద్ద శ్రీశైల జగద్గురు సేవాసమితి ట్రస్ట్ వారిచే ప్రవచనం, భక్తసంగీత విభావరి, భజనలు, సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఏడాదికి ఒకసారి జరిగే ఈ మహత్తర కార్యక్రమాలలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఉగాది పండగను కుటుంబసమేతంగా జరిపేందుకు శ్రీశైలం మీకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది.



Click it and Unblock the Notifications













