మారేడుమిల్లిలో జలపాతాల సవ్వడులు..
పచ్చని ప్రకృతి సోయగాలు, జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, ఒకేచోట దొరికితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు అలాంటి ప్రదేశాన్నే మనం చూడబోతున్నాం. అదే తూర్పు గోదావరిజిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం. ఇక్కడి ప్రకృతి అందాలను వర్ణించే ముందు జలపాతాల సవ్వడులను ఆస్వాదించాల్సిందే. నల్లని బండరాళ్లను తచ్చాడుతూ ఉప్పొంగి ప్రవహించే స్వచ్ఛమైన నీటి సవ్వడులు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. అందుకే తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో దాగిన ఈ రెండు జలపాతాల అందాలను కుటుంబసమేతంగా చూసేందుకు బయలుదేరుదాం రండి.
అందమైన జలపాతాలు..
రంపచోడవరం గ్రామం నుండి 4 కిలోమీటర్ల దూరంలో, మారేడుమిల్లి నుండి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంప జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో అద్భుతమైన జలపాతాలుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇవి మారేడుమిల్లిలో సందర్శించవలసిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. అంతేకాకుండా, ఆంధ్రాలోని ఉత్తమ జలపాతాలుగా కూడా ఇవి పేరుగాంచాయి. ఈ జలపాతం దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి జాలువారుతుంది. రంపచోడవరం సమీపంలో ఉన్న ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏకైక తీరప్రాంతం. దట్టమైన అడవి మధ్య ఉన్న ఈ జలపాతంలో స్నానం చేయడం చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఈ జలపాతంలో దిగువన ఏడాది పొడవునా నీరు ఉంటుంది.

జీపుల సవారీ..
ఈ జలపాతం దట్టమైన అడవిలో ఉంది. ఇక్కడికి జీపుల ద్వారా చేరుకోవచ్చు. దట్టమైన అడవి గుండా ప్రకృతితో పాటు అడుగులు వేస్తూ నడవడం పర్యాటకులకు ఒక ఉత్తేజకరమైన అనుభవాన్నిస్తుంది. ప్రవేశద్వారం నుండి ఈ జలపాతాన్ని చేరుకోవడానికి ఒక చిన్న ట్రెక్ ఉంది. ప్రవహించే నీటి ప్రవాహాంపై ఎక్కడం పర్యాటకులకు ఎంతో సాహసోపేతంగా కూడా ఉంటుంది. ఈ చిన్న ట్రక్కింగ్ పర్యాటకులకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ అనేక చిన్న జలపాతాలు ఉన్నాయి. ప్రధాన జలపాతాన్ని చేరుకోవడానికి 20 నిమిషాలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ జలపాతపు నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి.

శ్రీ నీలకంఠేశ్వర ఆలయం..
రంపచోడవరం జలపాతం సమీపంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం అనే పురాతన శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇక్కడ నృత్యోత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ ప్రసిద్ధ గిరిజన నృత్యం ప్రదర్శించబడుతోంది. ఈ డ్యాన్స్ సమయంలో, నృత్యకారులు ఉపయోగించే దుస్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

జలతరంగిణి జలపాతం
మారేడుమిల్లి బస్టాండ్ నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి గ్రామం వద్ద రాజమండ్రి భద్రాచలం హైవేపై ఉన్న సుందరమైన జలపాతం. ఇది కాలానుగుణ జలపాతం. ప్రధాన రహదారికి ఈ ప్రాంతం కాస్త దగ్గరగా ఉంటుంది. ద్విచక్ర వాహానాలపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ చిన్న జలపాతం ఉప్పొంగుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ జలపాతం స్వర్గధామమనే చెప్పాలి.
ఈ జలపాతపు నీరు స్పటికం వలె స్పష్టంగా ఉంటుంది. ఈ జలపాతం క్రింద స్నానం చేయొచ్చు. ప్రవేశ ద్వారం నుండి జలపాతం చేరుకోవడానికి 150 మీటర్లు నడవాల్సి ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ మార్గంలో ట్రెక్కింగ్ చేయడం కొంచెం శ్రమతో కూడుకున్నది. వాహనాలు నిలిపేందుకు విశాలమైన స్థలం కూడా ఇక్కడ ఉంది. మరెందుకాలస్యం మారేడుమిల్లికి బయలుదేరండి..



Click it and Unblock the Notifications












