నల్లమల కొండల్లో వెలసిన ఉగ్రనరసింహుని ఆవాసం.. అహోబిలం
శీతాకాలం వచ్చిందంటే.. అహోబిలం కొండల అందాలను రెట్టింపు అవుతాయి. మోడువారిన వృక్షాలు పచ్చదనాన్ని సంతరించుకోగా.. శిలలకు జలపాతాల గలగలలు తోడవ్వడంతో జీవం పోసినట్లు దర్శనమిస్తాయి. ప్రకృతి రమణీయతతోపాటు ఆధ్యాత్మిక చింతనను ఆస్వాదించేందుకు పర్యాటకులు అహోబిలానికి తరలి వస్తున్నారు. నల్లమల కొండల్లో వెలసిన నరసింహుని దర్శనానంతరం జలపాతపు సోయగాలను చూసి మధురానుభూతి పొందుతారు.
అహోబలం హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా పేరుగాంచింది. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. దట్టమైన అడవి, చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం.. అక్కడక్కడ జలపాతాలను ఆవాసంగా చేసుకుని వెలసిన నవనారసింహులు.. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం ప్రసిద్ధి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్కు 68 కిలోమీటర్ల దూరంలోను, ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఈ క్షేత్రం ఉంది.

దిగువ.. ఎగువ.. అహోబిలం..
అహోబిలం చేరడానికి అన్ని ప్రధాన క్షేత్రాల నుంచి మార్గాలు, రవాణా సౌకర్యాటు ఉన్నాయి. ముందుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమీటర్లు ప్రయాణిస్తే దిగువ అహోబిలం వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల భార్గవ, యోగానంద, క్షత్రపత నృసింహ ఆలయాలుంటాయి. దిగువ అహోబిలం నుంచి మరో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి ఎగువ అహోబిలానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో దారికిరువైపులా మహావృక్షాలు, వాటికి అల్లుకున్న లతలు ప్రకృతి ఒడిలోకి ఆహ్వానిస్తూ.. స్వాగత తోరణాలను మరిపిస్తాయి.
ఎగువ అహోబిలానికి చేరువలో ఎత్తయిన కొండలు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. రెండు కొండల మధ్య అహోబిలేశుడి ఆలయం ఉంటుంది. ఇక్కడి నుంచి కాలినడకన మాలోల, వరాహ, జ్వాలా, పావన, కారంజ నృసింహ స్వామి ఆలయాలకు వెళ్లొచ్చు. కొన్ని చోట్ల మార్గం చాలా క్లిష్టంగా ఉంటుంది. వరాహ నృసింహ ఆలయం పరిసరాలు ప్రశాంతతను పొందేందుకు అనువుగా ఉంటాయి. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పాద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చిందని అంటూ ఉంటారు. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామిగా భావిస్తారు.

కళ్యణ మహోత్సవ ఆహ్వానం..
అహోబిలం పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిసిన నరసింహ స్వామి భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడని ప్రతీతి. వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ క్షేత్రంలో ఏటా జరిగే కళ్యణ మహోత్సవం చూసేందుకు సుదూరప్రాంతాలనుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారట. హిరణ్యకశిపుడుని వధించేందుకు నారాయణుడు నరుడు, సింహం కలసి ఉగ్ర రూపంలో భూమి మీద ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.
అత్యంత శక్తి వంతుడు అయిన నరసింహుడు గ్రామాల బాట పట్టి, తన వివాహ మహోత్సవం చూసేందు రారండి అంటూ భక్తులను ఆహ్వానిస్తారట. ఏటా సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజు నుంచి 41 రోజుల పాటు వివాహ ఆహ్వానం అందించేందుకు గ్రామాలబాట పట్టే సందర్భం అహోబిలం పరిధిలో పండగ వాతావరణం నెలకొంటుంది. అది ఎంతలా అంటే, అందరూ సంక్రాంతి మూడు రోజులు జరుపుకొంటే, అహోబిల పరిసల గ్రామాల ప్రజలు 41 రోజులపాటు జరుపుకొంటారు.

వసతి సౌకర్యం..
ఆలయం దగ్గర వసతి కోసం దేవదాయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహంలో గదులు అద్దెకు తీసుకోవచ్చు. ఏపీ టూరిజం, ప్రైవేట్ వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












