Search
  • Follow NativePlanet
Share
» »సాహ‌స‌యాత్ర‌కు చిరునామా.. స‌లేశ్వ‌రం యాత్ర‌!

సాహ‌స‌యాత్ర‌కు చిరునామా.. స‌లేశ్వ‌రం యాత్ర‌!

సాహ‌స‌యాత్ర‌కు చిరునామా.. స‌లేశ్వ‌రం యాత్ర‌!

ఆ పురాతన ఆలయాన్ని చేరుకోవాలంటే.. గుండెల్లో కాస్తంత ధైర్యం నింపుకోవాలి. సాధారణంగా గుడి అంటే నిత్యం పూజలు, నైవేద్యాలు సహజం. కానీ, ఆ ఆలయం కేవలం ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే తెరచి ఉంటుంది. ఆ తలుపులు తెరుచుకోవాలంటే మళ్ళీ ఏడాది వేచిచూడాల్సిందే. అక్కడికి చేరుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపిస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఆసక్తి ఒక్కటే చాలదు, గుండె ధైర్యం కూడా పుష్కలంగా ఉండాలి. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న సలేశ్వరం సాహసయాత్ర విశేషాలే మీకోసం.

సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఓ యాత్రా స్థలం. చారిత్రక ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక చింతన కలబోసిన ప్రదేశం. శ్రీశైలం అడవులలోని ఆదిమవాసి యాత్రా స్థలంగా ఇది పేరుగాంచింది. ఇక్కడ ఏడాదికోసారి బృహత్తరమైన జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన

త‌ర్వాత మొదలవుతుంది. ఇక్క‌డికి చేరుకునేందుకు చివరిగా సలేశ్వరం గుట్ట వరకే వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. సలేశ్వరం ఆలయాన్ని చేరుకోవాలంటే దాదాపు ఆరు కిలోమీటర్లు గుట్టలు, లోయలలో నడవాలి. దారిపొడ‌వుగా అడ‌వి అందాల‌ను సంద‌ర్శ‌కుల‌ను క‌నువిందు చేస్తాయి. అలా ముందుకు సాగే క్ర‌మంలో మ‌ధ్య‌లో మోకాళ్ళ పర్వతం అనే గుట్ట వస్తుంది. దానిని ఎక్కడం చాలా కష్టం. అందుకే దీనిని సాహ‌స‌యాత్ర‌గా చెబుతారు.

saleshwaramyatra-2023

అది దాట‌గానే సాహ‌సానికి ఫ‌లితం ద‌క్కింద‌నే అనుభూతి క‌లుగుతుంది. గుట్టల మధ్యలో అందమైన జలపాతాలు, గుహలు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీప్రాంతం కావటంతో ఎక్కువ మంది కాస్తంత భయంతోనే ఈ ప్రాంతానికి వస్తారు. అయితే, కొండకోనల అందాలు ఆ భయాన్ని పటాపంచలు చేస్తాయి.

వింత అనుభవాల పరిచయం!

కాలినడకన వెళ్లే దారిలో ముందుగా గుహలో ఉన్న పురాతన లింగాకారం కనిపిస్తుంది. ఇక్కడ సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే లోపలకు అనుమతి ఉంటుంది. ఇక్కడే స్వచ్ఛమైన నీటి సవ్వడులతో పరవళ్లు తొక్కే జలపాతాలు దర్శనమిస్తాయి. చల్లటి వాతావరణం, చుట్టూ పచ్చదనంతో నిండిన అటవీ ప్రాంతాన్ని చూస్తే జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతిని మనసులో దాచుకోవచ్చు. సలేశ్వర ఆలయాన్ని ఆరవ శతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో వేసే ప్రతి అడుగూ ఎన్నో వింత అనుభవాలను పరిచయం చేస్తుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే, చుట్టూ ఎత్తయిన కొండలు, దట్టమైన అడవి.

గుండంలోని నీరు చల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రజల విశ్వాసం. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే రాతిప్రతిమ ఉంటుంది. స్థానిక చెంచులే ఇక్క‌డి పూజారులుగా వ్యవహరిస్తారు. కింద గుహలోనూ అదే ప్రతిమ ఉంటుంది.

ఆలయం ముందుభాగంలో వీరభద్రుడు, గంగమ్మలుగా చెప్పుకునే పురాతన రాతి విగ్రహాలు కనువిందు చేస్తాయి. సలేశ్వరం జాతర ఏడాదికోసారి వేసవిలో ఐదు రోజుల జరుగుతుంది. అక్కడికి వచ్చే ఔత్సాహికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా కొంతమంది దాతలు ఉచిత భోజన, వసతులు ఏర్పాటు చేస్తుంటారు. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వర క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.

హర్రర్ సినిమా గుర్తుకొస్తుంది!

అక్కడి నుంచి కొంత దూరం వెళితే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిధిలావస్థలో ఉన్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది కేంద్రాన్ని నిర్మించుకున్నాడట! అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు. అంటే, అందమైన ప్రదేశం అని అర్థం. దట్టమైన అడవిలో ఈ పురాతన భవన సముదాయాలను చూస్తే ఎవ్వరికైనా హర్రర్ సినిమా గుర్తుకొస్తుంది. చాలామంది ఇక్క‌డికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే, చాలా భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని క‌లిగి ఉంటుంది ఆ ప్ర‌దేశం.

saleshwaramyatra1

ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రాలలో ఇదొకటి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహణలోని టైగర్ సఫారీ ద్వారా నల్లమల అడవిలో స్వేచ్ఛగా తిరగాడే జంతువుల్నీ పర్యాటకులు వీక్షించవచ్చు. ఈ జోన్ నుంచి మన్నూరు, బలనేరు మండలం దావాగు, లింగాల నుంచి సలేశ్వరానికి మూడు నడకదారులున్నాయి. ఈ ప్రాంతం మీద అవ‌గాహ‌న ఉన్న‌వారి స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఒంట‌రి ప్ర‌యాణం అస్స‌లు మంచిది కాదు. మీరు వెళ్ల‌బోయేది అడ‌విలోకి అన్న‌విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. అది కూడా క్రూర‌మైన మృగాలు సంచ‌రించే ప్రాంతం క‌నుక నిత్యం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

ఇలా వెళ్లాలి?

శ్రీశైలం వెళ్లే దారిలో మన్నూరు అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి 10-12 కిలోమీటర్ల దూరం వెళితే రోడ్డు పక్కగా సలేశ్వరం బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో చూపించే మార్గం గుండా పది కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం లోయ వస్తుంది. అక్కడే వాహనాలను ఆపాల్సి ఉంటుంది. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ఆకాశగంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం. అలాగే, నిజాం విడిది ప్రదేశం నుంచి ఎడమవైపు 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం మీ సాహ‌న యాత్ర‌ను మొదులుపెట్టండి.

More News

Read more about: saleshwaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+