అనంత సిగలోని.. అందాల జలపాతాలు..!
అనంతపురం..ఈ పేరు వినగానే అందరికీ ఎండిన బోరుబావులు.. ఎడారిని తలపించే పరిసరాలు కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ, ఈ వర్షకాలంలో అనంతపురం జిల్లా ఆనందతీరంగా మారిపోయింది. ఎడారిగా మారిన ఈ ప్రాంతం కాస్త జలపాతపు సవ్వడులతో కళకళలాడుతుంది. వర్షకాలంలో కొండల నుంచి దూకే ఈ జలపాతపు సవ్వడులు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రండి ఈ సీజన్లో అనంతపురంలోని అందమైన జలపాతాలను చూసొద్దాం.

బట్రేపల్లి జలపాతం..
తలుపుల మండలంలో ఉన్న బట్రేపల్లి జలపాతం అనంతపురం నయాగారాగా పేరొందింది. వర్షాలు కురిసినప్పుడు సమీపంలోని అడవుల్లో నీటి ఊట ప్రారంభమై కొండమీద నుంచి పాయలుగా జాలువారుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాలను వీక్షించేందుకు చుట్టుపక్కలా ప్రాంతాల పర్యాటకులు తరలివస్తుంటారు. ఏటా వర్షకాలంలో ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎక్కువగా వర్షం కురింసిందంటే ఈ జలపాతం అందం మరింత రెట్టింపవుతుంది. అనంతపురానికి 105 కిలోమీటర్ల దూరంలో కదిరి రేంజ్ ఫారెస్ట్లో ఉంది. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కటారుపల్లి యోగి వేమన సమాధి కూడా చూడదగిన ప్రాంతం. ఇక్కడికి సమీపంలో ఉండే ఖాద్రీ నరసింహస్వామి దేవాలయం కూడా యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

పెన్నహోబిళం జలపాతం..
తుంగభద్ర పరీవాహకంలో పెన్నహోబిళం వద్ద కనువిందు చేస్తున్న జలపాతం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. జిల్లా వాసులతోపాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి తరలివస్తుంటారు. జిల్లాలోని ఉరవకొండ సమీపంలో పెన్నహోబిళం వద్ద కొండల నడుమ నుంచి జాలువారుతున్న నీటి సవ్వడులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర నుంచి జిల్లాలోని ఎంపీఆర్ జలాశయానికి వెళ్లే నీరు కొండకోనల గుండా ప్రవహిస్తూ ఇక్కడి ఎత్తయిన రాళ్ల మీదుగా జాలువారుతుండడం జలపాతాన్ని తలపిస్తోంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు పర్యాటక ఆనందానుభూతిని పొందడమే కాకుండా, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇక్కడ కొన్ని లఘుచిత్రాల షూటింగ్లు కూడా జరిగాయి.

ఆలూరుకోన జలపాతం..
తాడిపత్రి మండలంలోని ఆలూరుకోన జలపాతం కొండలు, కోనలతో ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. రెండు కొండల మధ్య వచ్చే జలధారలతో కనువిందు చేసే ఈ జలపాతం సంవత్సరం అంతా కళకళలాడుతూ ఉంటుంది. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో ఎర్రతిమ్మరాజుచే నిర్మించబడింది. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హజీవలి దర్గా కొండ పైభాగంలో కలదు. ఆలూరుకోన జలపాతం అనంతపురంలోని తాడిపత్రి పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కలదు.
కోన ఉప్పలపాడు జలపాతం
తాడిపత్రిలోని యాడికి మండలం ఉప్పలపాడు గ్రామంలోని కోన మల్లిఖార్జున స్వామి కొండల పరిసరాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ కొండల్లోనే ఉంది ఒక జలపాతం. ఈ జలపాతపు సవ్వడులు పర్యాటకులను మైమరింపజేస్తున్నాయి. కోన ఉప్పలపాడు సమీపంలో సుమారు 2,500 ఎకరాల్లో గుహలు విస్తరించి ఉన్నాయి. గుహలకు రెండు కిలోమీటర్ల దూరంలో కోన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు.



Click it and Unblock the Notifications













