శేషాచలం అడవుల్లో దాగిన గుంజన జలపాతపు అందాలు
ప్రకృతి ప్రేమికులన ఆకట్టుకునే జలపాతం వేసవిలోనూ పరవళ్లుతొక్కుతుందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అలాంటి జలపాతమే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉంది. అదే అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంజన జలపాతం. ఇది కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికుల దృష్టి ఆకర్షిస్తోంది.
ఇక్కడ ఎటువంటి సమయాల్లో కూడా నీరు ఇంకిపోయిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రాంతం బాలపల్లె రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఆ రేంజ్ పరిధిలో 23 వేల ఎకరాలలో శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో ఎంతో విలువైన, అరుదైన అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి.

కాళ్లకు పని చెప్పాల్సిందే..
ఇక్కడకు చేరుకునేందుకు ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. రైల్వేకోడూరుకు పశ్చిమంగా శేషాచలం కొండల్లో, సుమారు 11 కిలోమీటర్ల దూరాన 244 అడుగుల ఎత్తైన 'గుంజన జలపాతం చూడాలంటే ఆమాత్రం సాహసం చేయకతప్పదులేండి. మండలంలోని ప్రధాన రహదారిపై ఉన్న మాధవరంపోడు నుంచి వాగేటికోన వద్ద వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు శేషాచలం అటవీ మార్గం మీదుగా గుంజన జలపాత జారకు కాలినడకన వెళ్లాలి.
చాలామంది సందర్శకులు ఉదయం వెళ్లి అక్కడే సాయంత్రం వరకూ విడిది ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ దొరికే చేపలు పట్టి, వండుకోవడం చేస్తూ ప్రకృతి ప్రేమికులు ఈ జలపాత అందాలు ఆస్వాదిస్తుంటారు. దీనితోపాటు విశాలమైన, ఎత్తయిన కొండలు, ఎత్తయిన ఎర్రచందనం వృక్షాలు పచ్చదనం పరుచుకుని ఉంటాయి. ఈ మార్గంలో వివిధ రకాల చెట్లు, పక్షులు చూపరులను ఇట్లే ఆకట్టుకుంటాయి.
ప్రకృతి ప్రణాళికలా అనిపిస్తుంది..
పచ్చదనం కమ్మేసిన ఈ శేషాచలం అడవులకే తలమానికంగా నలిచే గుంజన జలపాతం చేరుకునేందుకు చాలా దూరం కాలినడక తప్పదు. మండు వేసవిలోనూ అస్సలు తగ్గని నీటి ప్రవాహం ఇక్కడి ప్రత్యేకత. జలపాతం దగ్గరకు చేరుకునే కొలదీ మీ సాహస యాత్ర మరింత పదునుగా ఉంటుంది. పూర్తిగా పాకుపట్టిన బండరాళ్లు మీకు ఆహ్వానం పలుకుతాయి. అయితే, జలపాతం చేరుకున్నాక మాత్రం మీ అలసటను దూరం చేసే ప్రకృతి అందం కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ప్రవహించే గుంజనకు పైభాగాన గలకంగుమడుగుతోపాటు 'మూడేళ్ల కురవ' ప్రధాన జలవనరుగా చెబుతారు. పెనుబాములకోన, ఎనుములేటికోనల నీళ్ళు 'మూడేర్ల కురవ'ను ఎల్లవేళలా నిండుగా ఉండేలా ప్రకృతి ఇక్కడ ప్రణాళిక వేసినట్లే ఉంటుంది. 'గుంజన' అసలు పేరు 'కుంజర'(ఏనుగు) అయి ఉంటుందని చెబుతారు. కాలక్రమేణా గుంజనగా నానుడిలోకి వచ్చిందని అంటారు. ఈ ప్రాంతంలో ఏనుగులు విస్తారంగా సంచరిస్తాయనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. పుల్లగూరపెంట దగ్గరున్న ఓ నిలువుపాటి బండ మీద చిత్రితమైన అడవి ఏనుగు బొమ్మ అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది.

అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి
ఇక్కడి అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉంటాయి. గతంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడంతో ప్రస్తుతం అటవీ అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. జలపాతాన్ని చేరుకోవాలని ఆసక్తి ఉన్నవారు తగిన గుర్తింపును చూపించి అటవీ అధికారుల అనుమతులతోనే లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, నిప్పు విషయంలో చాలా జాగ్రతగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి ఫైర్ క్యాంపులకు అస్సుల అనుమతులు ఉండవు. ప్రకృతి నచ్చింది కదా.. అని రిస్క్ చేస్తే మాత్రం అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి.



Click it and Unblock the Notifications












