ఏటా తొలకరి చినుకులు నేలను తాకిన క్షణాన ఇక్కడి అడవి అందాలు సరికొత్తగా పులకరిస్తాయి. కొండ కోనల నుంచి జాలువారే సెలయేళ్లు కేరింతలు కొడుతూ జలపాతాలుగా సందడి చేస్తాయి. మనసును ఆహ్లాదపరిచేలా పక్షుల కిలకిలారావాలు ప్రశాంతతను చేరువ చేస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే భూతల స్వర్గంగా మారుతోంది ఆ ప్రాంతం. అదే.. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. ఈ అటవీ ప్రాంతంలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి అందాలు ఆకర్షిస్తాయి. చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సందర్శకులను తనవైపు తిప్పుకుంటోన్న మారేడుమిల్లి ప్రకృతి అందాల విశేషాలను చూసొద్దామా?!
వర్షాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తుంటారు. విలక్షణమైన ఇక్కడి గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు సందర్శకులను ఓ కొత్త ప్రపంచడంలోకి తీసుకువెళతాయి. జాలువారే జలపాతాలతో పాటు కనువిందుచేసే క్యాంపింగ్ ప్రాంతాలకు మారేడుమిల్లి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. మరీముఖ్యంగా వారాంతాల్లో కుటుంబ సమేతంగా విహారయాత్ర ప్లాన్ చేసుకునేవారికి ఇది సరైన ఎంపిక.

ఆ ప్రయాణం.. ఓ తియ్యని అనుభూతి
ఈ మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ స్టేషన్. ఈ ప్రదేశం చుట్టుపక్కల కొండలు కంటే చాలా ఎత్తులో ఉంది. ఇక్కడి పై భాగం మొత్తం పచ్చదనంతో నిండి చదునుగా ఉండడంతోపాటు చుట్టూ గడ్డి తివాచీ పరిచినట్లు అందంగా ఉంటుంది. చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుండడం చూసేవారు ఎవ్వరైనా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేరు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉంటుంది.
చింతూరు వెళ్లే ఘాట్రోడ్డు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని చేరవచేస్తుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో నిండిన దట్టమైన చెట్లు మనల్ని రా.. రమ్మని ఆహ్వానించినట్లు సయ్యాటలాడుతాయి. ఒంపులు తిరిగే ఈ రోడ్డు మార్గంలోపైకి వెళ్లే కొలదీ చల్లని పిల్లగాలుల అల్లరి మొదలవుతుంది. ఆ మదుర క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే మరి. ఘాట్లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతి ఇక్కడ అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు.

జలపాతాల సవ్వడులు..
మారేడుమిల్లి మండల కేంద్రం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలతరంగిణి జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే, ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలను చూడొచ్చు. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఎక్కువ మొత్తంలో దర్శనమిస్తాయి. ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మారేడుమిల్లి మండల కేంద్రం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి.
రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్ లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ప్రకృతి ఒడిలో శాదదీరేందుకు..
ఇక్కడికి వచ్చే సందర్శకులు తప్పక చూడాల్సిన మరో ప్రదేశం.. మదనికుంజ్-విహార స్థల్. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ప్రకృతి ఒడిలో శాదదీరిన అనుభూతిని చేరువ చేస్తాయి. అలాగే, ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో జంగిల్ స్టార్ కూడా ఒకటి చెప్పొచ్చు. ఇది వలమూరు నదికి సమీపంలో ఉంది. తూర్పు కనుమలకు సమీప అడవుల్లో మూడు వైపులా పొంగి పొర్లే ప్రవాహాల మధ్య రాత్రి పూట క్యాంపింగ్ మర్చిపోలేని క్షణాలను అందిస్తుంది.
ఈ సీజన్లో ఒక్క ఏపీ నుంచే కాకుండా పాండిచ్చేరి, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ప్రకృతి ప్రేమికులు ఇక్కడ వాలిపోతుంటారు. హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. తెల్లవారు జామున మీ టూర్ ప్లాన్ చేసుకుంటే సాయంత్రానికి తిరుగు ప్రయాణమవ్వొచ్చు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












