ఎపిలోని అతిపెద్ద హనుమంతుని ఆలయం... కసాపురం నెట్టికంటి దేవాలయం..
భారతదేశంలో ఎన్నో ఆధ్మాత్మిక క్షేత్రాలున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే దేశంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నోదేవాలయాలు, పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఎపిని ప్రముఖ పుణ్యక్షేత్రాల రాష్ట్రంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, ఎంతో ప్రతిష్టాత్మకమైన వెంకటేశ్వరుని ఆలయం మన ఎపిలోని తిరుపతిలోనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీశైలం, ఇలా చాలారకాల దేవాలయాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి అనంతపురంలో వెలసిన ఆంజనేయస్వామి దేవాలయం..

ఎక్కడ ఉంది...
ఈ దేవాలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలంలో గల శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలోని ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ, రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం ఈ దేవాలయం. శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రంగా కూడా ఈ ఆలయానికి పేరుంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకీ పెద్దది ఇదే. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ దేవస్థానాన్ని విజయనగర రాజుల కాలంలోనే నిర్మించారని చరిత్ర మనకు చెబుతుంది. ఇంకా ఇక్కడికి చాలామంది భక్తులు భూత, ప్రేత, గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
ఎలా వెళ్లాలి..
ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే గుంతకల్లు రైల్వే స్టేషన్కు ఎపి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైలు మార్గాలు కలవు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం కలదు. ఇక్కడి నుంచి ఆటోలు, రిక్షాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. కసాపురం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్లారీ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి ఆటోలు, బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బస చేసేందుకు అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ బస చేసేందుకు దేవస్థానం వారి కాటేజ్ లు, రూమ్ లతో ప్రైవేటు లాడ్జిలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా స్వామివారి దేవస్థానం చుట్టూ కొన్ని భవంతులను నిర్మించారు. అక్కడ భక్తులు, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవచ్చు. వీటికి సుమారు 300 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు వసూలు చేస్తారు.

ఈ ఆలయ ప్రత్యేకత..
ఇక్కడ కొలువై ఉన్ననెట్టికంటి ఆంజనేయస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. నెట్టింకంటే అంటే నేరుగా చూసే కన్నుఅని అర్థం. ఇక్కడ స్వామివారి కేవలం కుడివైపు భాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడగలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు. అలాగే కసాపురం అనే గ్రామంలో ఈ దేవాలయం కొలువై ఉండటం వలన కసాపురం ఆంజనేయస్వామిగా దీనిని పిలవడం జరుగుతుంది. పూర్వం ఇక్కడ నెట్టికళ్లు అనే గ్రామం ఉండటం వలన అది కాల క్రమంలో నెట్టికంటి ఆంజనేయస్వామిగా ప్రసిద్ది చెందినది ఇక్కడివారు చెబుతున్నారు. ఈ దేవస్థానం పరిసరాలలో గోశాలలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications












