బీహార్లో ప్రసిద్దిచెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం కోటలకు ప్రసిద్ధిచెందింది. అయితే ఇక్కడ ఉండే ఓ కోట నేలపై కాదు, భూమికింద ఉంటుంది. నేటికీ వేల సొరంగాలు, సెల్లార్లు ఉన్నాయి. అదే షేర్ఘర్ కోట. ఇది ఒక రహస్యమైన కోట. దీని గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం తేలీదు. ఈ కోటలో వేలాది సొరంగాలు ఉన్నాయి. ఆ సొరంగాలు ఎక్కడి నుండి ప్రారంభయ్యి ఎక్కడివరకు ముగుస్తాయో ఎవరికీ తెలీదు. బీహార్లోని ఈ కోట రహస్యాలేంటో తెలుసుకుందాం పదండి.
బీహార్లోని చారిత్రాత్మక నగరం ససారమ్లో ఉన్న షేర్ఘర్ కోట ఒక పురాతన కోట. ఇది దాని సొంత విశిష్టమైన వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ కోటను 16వ శతాబ్దంలో సుర్ సామ్రాజ్య స్థాపకుడు షేర్ షా సూరి నిర్మించాడని చరిత్ర చెబుతోంది. 'గ్రాండ్ ట్రంక్ రోడ్' రూపాయి (భారత కరెన్సీ) ప్రవేశానికి ప్రసిద్ధి చెందిన షేర్ షా సూరి అనేక అద్భుతమైన భవనాలను నిర్మించాడు. అందులో ఒకటే ఈ షేర్ఘర్ కోట.
శతాబ్దాలుగా ఈ కోట అనేక యుద్ధాలను చూసింది. అంతేకాదు, ఎందరో రాజులు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఈ కోట ప్రాంగణంలో కనిపించే నిర్మాణ కళలో మార్పులు, మరమ్మత్తు పనులు కొనసాగడానికి ఇదే కారణం. ఇప్పుడు ఈ కోట శిథిలావస్థకు చేరుకుంది. అయినా ఈ ప్రదేశపు ఆసక్తికరమైన కథలు ఈ కోటను మాత్రం వీడలేదు. షేర్ఘర్ కోట అనేక రహస్యాలను కలిగి ఉంది.

భూమి కింద ఉన్న కోట..
భారతదేశంలో నేలపైన నిర్మించబడని కోట ఇదే. సుమారు 400 సంవత్సరాల పురాతనమైన ఈ కోటలో ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా సూరి నివసించేవారు. అందుకే దీనిని షేర్ఘర్ కోట అని పిలిచేవారట. ఈ కోట కైమూర్ కొండలపై ఉంది. ఈ కోట ఇతర కోటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కోట బయట ఎవరికీ కనిపించని విధంగా నిర్మించబడింది. ఈ కోట చుట్టూ మూడు వైపులా అడవులు ఉండగా, ఒక వైపు దుర్గావతి నది ఉంటుంది. ఈ కోట లోపలికి ప్రవేశించాలంటే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ సొరంగాలను మూసివేస్తే కోట ఎవరికీ కనిపించదు. ఈ కోటలో నిర్మించిన సెల్లార్లు చాలా పెద్దవిగా ఉంటాయి.
ఇందులో ఒకేసారి 10 వేల మంది లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సొరంగాల రహస్యం షేర్ షాకు, అతని నమ్మకమైన సైనికులకు మాత్రమే తెలుసు. ఈ కోటలో షేర్ షా నిధి కూడా దాగి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే దాని ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. కోటలోని సొరంగాలు, సెల్లార్ల కారణంగా లోపలికి వెళ్లేందుకు చాలామంది భయపడుతుంటారు.

ఎలా వెళ్ళాలి..
ఢిల్లీ, వారణాసి మరియు పాట్నాతో సహా అనేక నగరాల నుండి బీహార్లోని ఈ కోట వెళ్లేందుకు మార్గాలు ఉననాయి. అంతేకాకుండా, పాట్నాలోని అనేక జిల్లాల నుండి బస్సు సర్వీస్ కూడా ఉంది. గయా, పాట్నా విమానాశ్రయాలు సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ కోటతో పాటు అనేక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందులో చౌరాసన్ ఆలయం, ధువాన్, మజర్ కుండ్, షేర్షా సూరి సమాధి, రోహ్తాస్గఢ్ కోట వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications












