Search
  • Follow NativePlanet
Share
» »పూలవ‌నాల నెల‌వంక‌.. క‌డియ‌పులంక‌!

పూలవ‌నాల నెల‌వంక‌.. క‌డియ‌పులంక‌!

పూలవ‌నాల నెల‌వంక‌.. క‌డియ‌పులంక‌!

ప్రకృతి రమణీయతనంతటినీ ఒక్కచోటికి చేర్చి.. స్వదేశీ, విదేశీ సరిహద్దుల్ని చెరిపేసి.. మనసుకు హాయినీ, ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇచ్చే ప్రాంతాన్ని వీక్షించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిందే. అక్కడికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోనున్న కడియపులంక నర్సరీలను సందర్శించాల్సిందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడియం. ఈ పేరు వినగానే హోయలోలికే పూలమొక్కల అందాలు గుర్తుకొస్తాయి. కుటుంబస‌మేతంగా ఇక్క‌డికి వెళ్లేందుకు ప‌ర్యాట‌కులు ఆస‌క్తి చూపిస్తారు. ఇక్కడి నేలలో విరబూస్తున్న పూల వెనుక చాలా చరిత్ర ఉంది. నిజానికి మొక్కలకు అంటు కట్టే విధానం, పూలమొక్కల పెంపకం, పూలను అమ్మడం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఉండేది. ఆ విధానం పై మక్కువతో రావు చిన్నారావు 1902లో 'రాయల్ నర్సరీ'ని కడియపులంకలో ప్రారంభించారు. ఆకుల సుబ్బారావు, పరిమి రామారావు, పల్ల నారయ్య, రావు చిన్నారావు తదితర రైతులు ఆలోచనలకు కార్యరూపం తీసుకొచ్చారు. వీరినే కడియపులంక పూలవనాల చరిత్ర నిర్మాతలుగా చెబుతారు. తొలుత వంద ఎకరాలుండే ఈ నర్సరీల విస్తీర్ణం ఇప్పుడు వేమగిరి, వీరవరం, మడికి, దామిరెడ్డిపల్లి, ఏడిద, మురమండ, మాధవరాయుడుపాలెం, కడియం సావరం వంటి పది గ్రామాల్లో ఆరు వేల ఎకరాలకు పైబడి సుమారు 800 నర్సరీలు (పూలవనాలు) విస్తరించాయి.

అమ్మకాలు ప్రారంభమైందిలా

అమ్మకాలు ప్రారంభమైందిలా

పూలవనాల ప్రారంభదశలో పూలను కావడిలో పెట్టుకుని, రాజమండ్రి వరకూ కాలినడకన వెళ్ళి అమ్మేవారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి మొక్కలు ఆరోగ్యంగా, ఎదుగుదల బాగా ఉండటంతో మంచి పేరు వచ్చింది. పూలమొక్కల పెంపకం, అమ్మకంలోంచి మామిడి, జామ వంటి రకాలు అమ్మేలా ఉన్నతమైన మార్పులు వచ్చాయి. నేడు సపోటా, జామ, మామిడి, నేరేడు, సీతాఫలం, స్టార్ ఫ్రూట్ (బిలంబి), మూడడుగుల ఎత్తులో ఉండే నారింజ వంటి మొక్కల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. వందల, వేల రకాల మొక్కల్ని ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తున్నారు. అందుకే ఇక్క‌డ అడుగుపెడితే, క‌నువిందే చేసే పూల వ‌నాలేకాదు, నోరూరించే ఫ‌లాలు కూడా ల‌భిస్తాయి.

సుదూర ప్రాంతాల వారికి ఉపాధి

సుదూర ప్రాంతాల వారికి ఉపాధి

అంతేకాదు మొక్కల ఎగుమతికి శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి సుమారు 10 వేల కుటుంబాలు ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చి స్థిరపడ్డాయి. మొత్తంగా 800 నర్సరీల్లో 20 వేల మంది వరకూ ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పనిచేసే వారు తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ, తమిళం కూడా మాట్లాడతారు. ఇతర రాష్ట్రాల వారితో ఈ విధంగా మాట్లాడేవారికి రోజుకు రూ. 600 వరకూ వేతనం లభిస్తుంది. ఇలా ప్రత్యక్షంగా ఉపాధి పొందేవారితోపాటు రిక్షా, ఆటో, వ్యాను, లారీ కార్మికులు సైతం మొక్కలను గమ్మస్థానాలకు చేర్చుతూ ఉపాధి పొందుతున్నారు.

చలనచిత్ర అందాలెన్నో

చలనచిత్ర అందాలెన్నో

ఇక్కడి నర్సరీల్లో శ్రీ‌ సత్యనారాయణ నర్సరీ గార్డెన్స్క ఒక ప్రత్యేకత ఉంది. విరబూసిన పూలవనాల్లో తారల నవ్వులు, ప్రేమలు సెల్యులాయిడ్ పై కనిపించేవి దాదాపుగా పల్ల వెంకన్న నర్సరీవే. ఇప్పటివరకూ 140 చిత్రాలకు పైగా షూటింగ్‌లు ఈ నర్సరీలో జరిగాయి. వాటిలో తెలుగు, తమిళ, హిందీ, ఒరియా తదితర భాష చిత్రాలున్నాయి. ఉచితంగానే షూటింగ్‌ల‌కు అనుమతించడం ఈ నర్సరీ ప్రత్యేకత. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ పల్ల వెంకన్న ఓ వికలాంగుడు. అయినప్పటికీ ఈ సంస్థను అంచలంచెలుగా అభివృద్ధి చేసి, కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారు. సందర్శించేవారిని నవ్వుతూ ఆహ్వానించడం ఇక్కడి నర్సరీల ప్రత్యేకత.

నర్సరీలో దొరికే మొక్కలేమిటి?

నర్సరీలో దొరికే మొక్కలేమిటి?

ఇక్కడి నర్సరీలలో మొక్కలను ఆరు తరగతులుగా వర్గీకరించారు. అవి ఆర్నమెంటల్ (అలంకరణకు ఉపయోగించేవి), అవెన్యూ (నీడనిచ్చేవి), ఇండోర్, అవుట్ డోర్, పండ్ల మొక్కలు, రెడీమేడ్ ప్లాంట్స్ గా విభజించారు. మొక్కలు పెంచి అవి చెట్లుగా మారడానికి సమయం పడుతుంది. అలా కాకుండా చెట్లు కావాలనుకునే వారికి రెడీమేడ్ ప్లాంట్స్ ఉపయోగపడతాయి. ఇవి గాక ఔషధ మొక్కలు, జాతక మొక్కలకు ఇటీవలి కాలంలో స్థానం కల్పిస్తున్నారు. సాధారణంగా మొక్కల ధరలు రెండు రూపాయల నుంచి రూ. 2000 వరకూ ఉంటాయి. ఇవిగాక అలంకరణకు ఉపయోగించేందుకు వివిధ జంతువులు, పక్షుల ఆకృతుల్లో తీర్చిదిద్దిన మొక్కలు రూ. 10 వేల వరకూ ఉంటాయి. ఇవిగాక కొన్ని అరుదైన విదేశీ మొక్కల ధర రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. మొక్కలు పెంచుకునే కుండలు కూడా వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి ధర రూ. 150 నుంచి రూ. 850 వరకూ ఉంటుంది. ఆల్లోనియా థాయ్ రెడ్ తదితర ఇండోర్ మొక్కలను బహుమతిగా ఇవ్వడానికి సంద‌ర్శ‌కులు ఎక్కువ‌గా ఇవి కొనుగోలు చేస్తారు. వీటి ధర రూ. 200 నుంచి రూ.1200 వరకూ ఉంటాయి.

మందారం.. అపురూపం

మందారం.. అపురూపం

పదిహేను వర్ణాల్లో మందారపువ్వులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిష్యూ కల్చర్ ద్వారా జెనటికల్‌గా మోడిఫై చేసిన ఈ 15 రకాల మొక్కలు పల్ల వెంకన్న, సత్యదేవా తదితర నర్సరీల్లో లభిస్తాయి. మందార మొక్కలు సాధారణంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కానీ ఈ మందార మొక్కలు రెండడుగులే పెరుగుతాయి. చెదలు, పురుగులు సైతం వీటిని ఆశించవు. అంతేకాకుండా ప్రతిరోజూ నాలుగైదు పువ్వులు పూయడం వీటి ప్రత్యేకత.

సెల్ఫ్ ఇరిగేటెడ్ పాట్స్

సెల్ఫ్ ఇరిగేటెడ్ పాట్స్

మొక్కలు ఇంట్లో, లేదా వరండాలో పెంచితే ఆ నీరు కిందపడటం సాధారణమే. అందుకు భిన్నంగా ఇండోనేషియా నుంచి రప్పించిన పాట్స్ ఇక్కడ లభిస్తాయి. వీటికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పైపులో నీరు పోస్తే కింది లేయర్లలోని మట్టికి నేరుగా చేరుతుంది. అంతేకాకుండా నీరు ఏ స్థాయిలో ఉందో ఇండికేటర్ ద్వారా తెలియజేస్తుంది. వీటిని గోడలకు సైతం హేంగర్ ద్వారా అమర్చుకోవచ్చు. మూడు కుండీలతో కూడిన ఈ సెట్ ధర ఐదు వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంది.

వ్యాపారంలో అధికభాగం ఆన్‌లైన్‌లోనే..

వ్యాపారంలో అధికభాగం ఆన్‌లైన్‌లోనే..

ఈ నర్సరీల నుంచి అధికభాగం విక్రయాలు ఆన్‌లైన్‌లోనే సాగుతాయి. 200 నర్సరీలు ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహిస్తుండగా, 60 సంస్థలకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఉన్నాయి. సామాజిక సేవలో భాగంగా పాఠశాలలకు, స్వచ్ఛంద సంస్థలకు మొక్కలు ఉచితంగా అందిస్తున్నారు. విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం మీదుగా వెళ్తే, ఐదో నెంబరు జాతీయ రహదారిలో మోరంపూడికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కడియం. రాజమహేంద్రవరం ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి ప్రతి 30 నిమిషాలకూ అనపర్తి మీదుగా కాకినాడ వెళ్లే పాసింజర్ సర్వీసులు ఉంటాయి. రామచంద్రాపురం వెళ్లే బస్సులు కూడా సందర్శకులను కడియం చేరుస్తాయి. నేరుగా వెళ్లాలనుకుంటే మోరంపూడి దాటాకా వేమగిరి వద్ద కడియం వెళ్లే దారిలో... నర్సరీలు స్వాగతం పలుకుతాయి.

More News

Read more about: vemagiri veeravaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+