రాజస్థాన్లో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దీనిని కోటల రాష్ట్రంగా కూడా పరిగణించారు. రాజస్థాన్లోని ప్రతి కోట రాజపుత్ర వైభవాన్ని, ఇక్కడ జరిగిన వివిధ యుద్ధాల వీరోచిత గాథలను చెబుతుంది. అయితే ఇక్కడి ప్రధానమైన సొరంగాల చిక్కైన కోట గురించి ఎప్పుడైనా విన్నారా? రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలో ఉన్న తారాఘర్ కోట ఇక్కడ ఉన్న సొరంగాల నెట్వర్క్ కారణంగా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. తారాఘర్ కోటను భారతదేశంలోని మొదటి కొండ కోట అని చెబుతారు.

తారాగఢ్ కోట చరిత్ర ఏమిటి
తారాఘర్ కోట అజ్మీర్లోని అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ కోట ఆరావళి పర్వత శ్రేణిలో ఉంటుంది. దీనిని నిటారుగా ఉన్న కొండపై 1354 సంవత్సరంలో నిర్మించారు. అదే సమయంలో రావ్ దేవ్ 1341లో బుండీ రాష్ట్రాన్ని స్థాపించాడు. తారాఘర్ కోట ఒకప్పుడు రాజస్థానీ, మొఘల్ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 1426 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని "స్టార్ ఫోర్ట్," అని కూడా పిలుస్తారు. 14వ శతాబ్దంలో నిర్మించబడిన తారాగఢ్ కోట ఆ కాలపు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కోటను అజ్మీర్ స్థాపకుడు అజయ్పాల్ చౌహాన్ నిర్మించారు. ఈ కోట సంభావ్య దండయాత్రల నుండి నగరాన్ని రక్షించడానికి ఇది ఒక వ్యూహాత్మక కోటగా పనిచేసింది. ఈ కోట గోడలు, బురుజులు, యుద్దాలు ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి.
పర్యాటకులు ఈ కోట కింద నుండి చూస్తే, కోట ఆకాశంలో నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే ఈ కోటకు తారాగఢ్ కోట అని పేరు పెట్టారు. ఈ కోట ప్రాకారాలపై నిలబడి చూస్తే బుండి నగర అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. తారాగఢ్ కోటలోకి ప్రవేశించగానే, కోట భారీ గేటు పర్యాటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ కోటలోకి ప్రవేశించేందుకు మూడు వేర్వేరు ద్వారాలు ఉన్నాయి. అవి లక్ష్మీ పోల్, ఫుటా దర్వాజా, గగుడి గేట్. అన్ని తలుపుల మీద ఏనుగుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ఈ కోట సొరంగాలు చూడదగినవి. యుద్ధ సమయంలో ఈ సొరంగాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈ సొరంగాలు రాజు, అతని కుటుంబం, అతని సిబ్బందిని అత్యవసర పరిస్థితుల్లో కోట నుండి సురక్షితంగా తరలించడానికి ఎంతగానో సహాయపడ్డాయి. ఈ కోటలో ఉన్న ఈ సొరంగాల్లోకి ప్రవేశించేందుకు సమగ్ర మ్యాప్ అందుబాటులో లేనందున ప్రవేశం లేదు.

కోటలోని ప్రత్యేక ఆకర్షణలు..
తారాఘర్ కోటలో భీమ్ బుర్జ్ అని పిలువబడే పెద్ద బురుజు కూడా ఉంది. ఈ కోట 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు. అప్పట్లో ఈ కోటలో ఆయుధాలు భద్రపరిచేవారు. ఈ కోటలో దాదాపు 6-7 భారీ రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఈ రిజర్వాయర్లన్నీ ఎండిపోవడం జరిగింది. కానీ సంక్షోభ సమయాల్లో కోట వాసుల సౌకర్యార్థం ఈ రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉండేది. ఈ కోటలో ఉన్న రాణి మహల్ మరో ప్రధాన ఆకర్షణ. ప్యాలెస్లోని కిటికీల గ్లాస్ పెయింటింగ్స్ అందంగా అలంకరించబడ్డాయి. కోట సముదాయంలో మీరాన్ సాహెబ్ దర్గా కూడా ఉంది.
శీతాకాలంలో ఈ కోట ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. తారాఘర్ కోటలో ప్రవేశించేందుకు భారతీయ పర్యాటకులకు 25 రూపాయలు, విదేశీయులకు 100 రూపాయలు ప్రవేశ రుసుము ఉంది. తారాఘర్ కోటను సందర్శించడానికి ఉత్తమ సమయం చలికాలంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే వేసవిలో మండే వేడిలో ఇక్కడ సంచరించడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. తారాగఢ్ కోట అజ్మీర్లోని దర్గా బజార్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అజ్మీర్ నుండి తారాగఢ్ కోటకు క్యాబ్ లేదా ఆటోను అద్దెకు తీసుకోవచ్చు. అజ్మీర్ నుండి తారాగడ్ కోట చేరుకోవడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది.



Click it and Unblock the Notifications












