ఏపీలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం పర్యాటక ప్రదేశాలకు నెలవు. ఇక్కడ అనేక జలపాతాలు, పురాతన ఆలయాలు పర్యాటకులు సందర్శించాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బొర్రా గుహల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇక, వీటిని అభివృద్ధి చేసేందుకు.. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అనేక రకాల వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.30 కోట్లు మంజూరుచేసినట్లు అధికారులు తెలిపారు.
వీటిలో రూ.24.1 కోట్లతో పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు ఏపీటీడీసీ ఆసక్తి వ్యక్తీకరణ కోసం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును నిర్మించి, నిర్వహించేందుకు ఐదేళ్ల కాలానికి కాంట్రాక్టు కూడా ఇవ్వనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. ఇది గనుక పూర్తయితే బొర్రాగుహలు వెళ్లే పర్యాటకులకు మరో కొత్త అనుభూతిని అందిస్తోంది. దీనివ వల్ల ప్రయాణం, పర్యటన అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి. స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి.
బొర్రా గుహలు ఇప్పటివీ కావు. సుమారు 1500 లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినవి బొర్రా గుహలు. ఇవి విశాఖపట్నానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీలోని పర్యాటక కేంద్రమైన అరకులోయకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు సముద్ర మట్టానికి సుమారు 1,400 మీటర్ల ఎత్తున ఉంటాయి. ఈ గుహలను చూడాలంటే బొర్రా రైల్వే స్టేషన్లో దిగి కిలోమీటరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్ నుంచి జీపులు, ఆటోలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.

పార్కింగ్కు రెండు ఎకరాల స్థలం..
బొర్రా గుహలను సందర్శించేందుకు రోజూ వేలాది మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. కానీ వారికి సరైన ప్రయాణ సౌకర్యం, పార్కింగ్, వసతి సౌకర్యాలు ఏవీ లేవు. ఈ క్రమంలో 5.89 ఎకరాల్లో రూ.24 కోట్లతో సౌకర్యాలు సమకూర్చాలని ఏపీటీడీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఈ అభివృద్ధిలో భాగంగా బొర్రాగుహల దగ్గర అచ్చంగా రెండు ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించింది. అలాగే బొర్రా గుహలకు వెళ్లే మార్గంలో అందమైన ద్వారాలను నిర్మిస్తారు.
గుహలకు వెళ్లే మార్గంలో ఒక ద్వారం ఉండగా, గుహల వద్ద మరో ద్వారం నిర్మిస్తారు. ఆ ప్రాంతమంతా వాహనాల పొగతో నిండిపోకుండా ఉండేందుకు ఇక్కడ ఎలక్ర్టిక్ వాహనాలను నడుపుతారు. ఈ వాహనాల ద్వారా పర్యాటకులను గుహలకు తీసుకువెళ్లి తీసుకవస్తారు. ఇక, ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం టాయిలెట్లు, లగేజీ భద్రపరుచుకునే గదులు, తాగునీటి సౌకర్యం కూడా కల్పించనున్నారు.

లోయ అందాలు..
ఇక, బొర్రా గుహ లోపలి అందాలను విభిన్న కోణాల్లో చూపించేందుకు సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతో పర్యాటకుల కళ్ల ముందు రంగుల ప్రపంచం ఆవిష్కృతం కానుంది. వీటితో పాటు ఇక్కడ గిరిజనులు తయారుచేసిన, పండించిన వాటిని విక్రయిస్తారు. దీనిని మార్కెట్ స్ర్టీట్గా అభివృద్ధి చేసేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అందుకోసం రెండు వైపులా ఫుట్పాత్లు నిర్మించనున్నారు. పర్యాటకులు పక్కనే ఉన్న లోయ అందాలను తిలకించేందుకు వ్యూపాయింట్లు, విజువల్ డెక్లను కూడా ఏర్పాటుచేస్తారు. సిటింగ్ ఏరియా కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. అడ్వంచర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్ వంటివి కూడా పెడతారు.
రెండు అంతస్థుల భవనం..
బొర్రా గుహలు చూసేందుకు వచ్చే పర్యాటకుల వసతి కోసం రెండు అంతస్థుల భవనం కూడా నిర్మిస్తారు. ఇక్కడే టికెట్లు, బ్యాగేజీ, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక గుహల లోపల అవసరమైన ప్రాంతాల్లో స్టెయిర్ కేసులు, రెయిలింగ్లు కూడా పెట్టనున్నారు. కొత్తగా విద్యుద్దీపాలు కూడా అమరుస్తారు. ఆధునాతనమైన సీసీ టీవీ కెమెరాలు వంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు.



Click it and Unblock the Notifications













