శీతాకాలం ప్రారంభం కాగానే రాజస్థాన్లో ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక పండుగలు, జాతరలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతుంటాయి. డిసెంబర్ 1నుంచి పుష్కర్ జాతర ప్రారంభం కాగా, ఆ తర్వాత కుంభాల్ఘర్ ఫెస్టివల్. ఇక ఇప్పుడు డిసెంబర్ చివరి వారంలో రాజస్థాన్లోని మౌంట్ అబూలో వింటర్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. రాజస్థాన్లో ఉన్న ఏకైక హిల్స్టేషన్ మౌంట్ అబూ. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక, ఇక్కడ డిసెంబర్లో నిర్వహించే వింటర్ ఫెస్టివల్కు సూదుర ప్రాంతాలనుండి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ వింటర్ ఫెస్టివల్ డిసెంబర్ 29 నుండి 31 వరకు మౌంట్ అబూలో నిర్వహిస్తారు. ఇందులో మీరు కూడా పాల్గొనలానుకుంటే మాత్రం తప్పకుండా మౌంట్ అబూ చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలను సందర్శించండి.
దిల్వారా జైన దేవాలయం
దిల్వారా జైన దేవాలయం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ఆలయ అద్భుతమైన వాస్తుశిల్పం కారణంగా నిత్యం ఈ ప్రదేశం వార్తలో నిలుస్తుంది. ఇక్కడి పాలరాతిపై చేసిన క్లిష్టమైన చెక్కడాలను చూస్తే 11, 12వ శతాబ్దాల కళాకారులు ఎంత ప్రతిభావంతులో అర్థమవుతుంది. ఈ ఆలయం జైన తీర్థంకరులకు అంకితం చేయబడింది. ఈ ఆలయం ప్రశాతంమైన వాతావరణంతో నిత్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించొచ్చు. ఈ ఆలయం సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుంది.

గురు శిఖరం
ఆరావళి కొండలలోని ఎత్తైన శిఖరంపై నిర్మించిన గురు శిఖర్ మౌంట్ అబూలోని సందర్శించదగ్గ ప్రదేశాల్లో ఒకటి. ఇది దత్తాత్రేయ భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. చుట్టుపక్కల పచ్చని అడవులు, వంకరగా ఉన్న రహదారులు పర్యాటకుల ప్రయాణానికి ఓ మధురమైన అనుభూతినిస్తాయి. చాలామంది పర్యాటకులు ఈ ఆలయానికి చేరుకున్నప్పుడు, వారు గమ్యస్థానం కంటే ఈ మార్గాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఆధ్యాత్మికత పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా వారైనా, గురు శిఖర సహజ సౌందర్యాలను వీక్షించేందుకు తప్పకుండా రావాల్సిందే..
నక్కి సరస్సు
మౌంట్ అబూ నగరం మధ్యలో వెలసింది నక్కి సరస్సు. ఈ సరస్సు నలువైపులా ఆరావళి కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ సరస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ సరస్సును దేవతలు తమ గోళ్ళతో తవ్వారని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఈ సరస్సుకి నక్కి అని పేరు వచ్చిందనే స్థానికులు చెబుతుంటారు. పర్యాటకులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఈ సరస్సు ఒడ్డున కాసేపు ప్రశాంతంగా గడపడానికి వస్తుంటారు. ఈ సరస్సులో పడవ ప్రయాణం కూడా చేయొచ్చు. మౌంట్ అబులోని నక్కి సరస్సు ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అందమైన ప్రదేశం.

సూర్యాస్తమయం పాయింట్
పర్వతాల వెనుక దాక్కుని ఉన్నసూర్యాస్తమయ దృశ్యాలను చూసేందుకు చాలామంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. వీటితో పాటు ఇక్కడ మౌంట్ అబూలోని సన్సెట్ పాయింట్ కూడా చాలా అందమైన పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ నుండి, ఆరావళి కొండల వెనుక దాక్కున్న సూర్యుని దృశ్యాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంటుంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సన్సెట్ పాయింట్ నక్కి సరస్సుకి నైరుతి దిశలో ఉంటుంది.
మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యం
మౌంట్ అబు కేవలం ప్రకృతి ప్రేమికులకే కాకుండా వన్యప్రాణుల ప్రేమికులకు కూడా ప్రసిద్ధిచెందిన ప్రదేశం. మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యం, చుట్టూ రాతి కొండలు ఉంటాయి. ఈ అభయారణ్యం వివిధ రకాల జీవులకు సహజ నివాసం. ఇక్కడ చిరుతపులి, సాంబార్ జింకలు, అడవి పంది, అనేక రకాల పక్షులను చూడొచ్చు. చల్లని వాతావరణం, దట్టమైన అడవి ఈ అభయారణ్యం అందాన్ని మరింత పెంచుతాయి. ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఈ ప్రదేశం ఎంతో అనువైనది.



Click it and Unblock the Notifications












